సర్వదేవతావ్రతాల పూజలకు ఉద్దిష్టం… ఫాల్గుణం

శ్రీమహావిష్ణువుకు ఇష్టమైన మాసాల్లో ఫాల్గుణం ఒకటి. పూర్ణిమ తిథిలో చంద్రుడు పూర్వ ఫల్గుణి లేదా ఉత్తర ఫల్గుణి నక్షత్ర సమీపంలో సంచరిస్తే, ఆ మాసాన్ని ‘ఫాల్గుణి’గా పరిగణిస్తారు. ప్రధానంగా విష్ణు ప్రీతికరం అంటోంది భాగవతం. చ్కెత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణం. ఇంతకు ముందు పదకొండు నెలల్లో చేసిన దేవతా పూజలు, వ్రతాలు ఈ చివరి మాసంలో మరో సారి ఆచరించడం విశేషం. అందుకే సర్వ దేవతా వ్రత సమాహారంగా, సర్వవ్రత సింహావ లోకనంగా కనిపిస్తుంది ఫాల్గుణ మాసం.
ఫాల్గుణ మాసంలో ప్రతి తిథికీ ఒక ప్రత్యేకత ఉంది. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పన్నెండు రోజులు పయోవ్రతం ఆచరించి మహా విష్ణువుకు క్షీరాన్నం నివేదిస్తే అభీష్ట సిద్ధి కలుగుతోందని భాగవత పురాణం వివరిస్తోంది. ఆదితి పయోవ్రతం ఆచరించి వామనుడిని పుత్రుడిగా పొందింది. విష్ణుపూజకు ‘పయోవ్రతం’ విశిష్టమైంది. దీన్ని శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభించి పన్నెండు రోజుల పాటు కొనసాగిస్తారు. సమీపంలోని నదుల్లో స్నానమాచరించి, సూర్యుడికి అర్ఘ్యమిచ్చి, విష్ణువును షోడశోపచారాలతో పూజించి, పాలను నైవేద్యంగా సమర్పించడం సంప్రదాయం. పయస్సు అంటే పాలు. అదితి ఈ వ్రతం ఫలితం వల్లే వామనుడు జన్మించాడట.
హరిహరసుతుడు అయ్యప్ప స్వామి, పాలకడలి నుంచి లక్ష్మీదేవి ఇదే మాసంలో జన్మించారు. ఇక మహాత్ములైన శ్రీకష్ణ చైతన్యులు, రామ‌కృష్ణ పరమహంస, స్వామి దయానంద సరస్వతిలు జననం కూడా ఈ మాసంలోనే జరిగింది. అర్జునుడి జన్మ నక్షత్రం కూడా ఇదే కాబట్టి ‘ఫల్గుణ’ అనే పేరుంది. కురు పాండవుల్లో కొందరు ఫాల్గుణ మాసంలో జన్మించినట్లు చెబుతారు. ఫాల్గుణ బహుళ అష్టమినాడు ధర్మరాజు, ఫాల్గుణ శుద్ధ త్రయోదశి రోజున భీముడు, దుర్యోధనుడు, దుశ్శాసనులు జన్మించినట్లు పురాణాలు తెలుపుతున్నాయి.
లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరుల్ని శుద్ధ తదియనాడు పూజించి నైవేద్యం సమర్పిస్తారు. ఈ మాసంలో రెండు రోజులు వినాయకుణ్ని ఆరాధిస్తారు. శుక్ల పాడ్యమి, చతుర్థినాడు అవిఘ్న, పుత్ర గణపతి వ్రతాల్ని ఆచరిస్తారు. శుద్ధ ద్వాదశి పయోవ్రతానికి చివరిరోజు. ఈ రోజున నరసింహస్వామిని పూజిస్తారు.
దివ్యౌషధంగా భావించే ఉసిరిని శుద్ధ ఏకాదశినాడు పూజించి, ఆ చెట్టు వద్దనే ‘అమలక ఏకాదశి’ వ్రతం నిర్వర్తిస్తారు. దీన్ని ‘అమృత ఏకాదశి’ గా పరిగణిస్తారు. మదురైలోని మీనాక్షీ సుందరేశ్వరుల కల్యాణం రోజు ఇది. అందుకే శివపూజ చేస్తారు. వసంత పంచమి నుంచి ఫాల్గుణ పూర్ణిమ ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటుంది. కనువిందు చేస్తుంది.
చలి పూర్తిగా తగ్గదు. నులివెచ్చదనం ప్రాణానికి హాయి కలిగిస్తుంటుంది. ఫాల్గుణ మాసంలో అతి ముఖ్యమైంది వసంతోత్సవం. ఇది కాముని పండుగ, హూలికా పూర్ణిమ, కామ దహనం పేరుతో ప్రఖ్యాతి చెందింది. ఈ పర్వదినాన శివుడు, మన్మథుడు, కృష్ణుడు, లక్ష్మీదేవి పూజలందు కుంటారు. ఫాల్గుణ మాసంలో పూర్ణిమ రోజున హూళీ పండుగను నిర్వహిస్తుంటారు. ఈ పూర్ణిమ శక్తితో కూడినది. ఏ సంవత్సరమైనా పూర్ణిమ, ఉత్తర ఫల్గుణి కలిసి వస్తే ఆ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి లక్ష్మీ అష్టోత్తర శతనామాలు కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిది. హూళి రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తే సమస్త శుభములు కలుగుతాయని పెద్దలవాక్కు. కొన్ని దక్షిణాది ఆలయాలలో ఫాల్గుణ పూర్ణిమను చాలా గొప్పగా చేస్తారు.
ఫాల్గుణ బహుళ పాడ్యమినాడే రావణుడితో యుద్ధానికి వానర సైన్యాన్ని వెంటబెట్టుకొని శ్రీరాముడు లంకకు వెళ్లాడు. చవితినాడు ‘సంకట గణశ’ వ్రతం ఆచరిస్తారు. బహుళ అష్టమి నాడు సీతాదేవి భూమి నుంచి ఆవిర్భవించింది. ఫాల్గుణంలో గోదానం, ధనదానం, వస్త్రదానం, గోవిందుడికి ప్రీతి కలిగిస్తాయని శాస్త్రవచనం. అందుకే ఆ రోజున రామాయణాన్ని చదివి, సీతారాముల్ని కొలుస్తారు.
ఫాల్గుణ బహుళ ఏకాదశినాడు రావణ కుమారుడు ఇంద్రజిత్తు, లక్ష్మణుడు మధ్య ప్రారంభమైన సమరం త్రయోదశి దాకా కొనసాగింది. రావణ బ్రహ్మను శ్రీరాముడు అమావాస్య రోజు వధించాడు. బ#హుళ అమావాస్య నాడు పితదేవతలకు పిండప్రదానం చేసి, అన్నదానం చేస్తారు.

  • రామకిష్టయ్య సంగనభట్ల…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *