Ramzan 2025: ప్రారంభమైన రంజాన్ ఉపవాస దీక్షలు..

హైదరాబాద్ : ముస్లింలు జరుపుకొనే అతి పెద్ద పండుగ.. రంజాన్. నెలరోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలను పాటించిన అనంతరం భక్తిశ్రద్ధలతో రంజాన్ పండుగను జరుపుకోవడం ఆనవాయితీ.

ఈ పండగ సందడి నేటి నుంచి ఆరంభమైంది. నెలవంక కనిపించడంతో నేటి నుంచి ఉపవాస దీక్షలు మొదలయ్యాయి.

ముస్లింలు నెల రోజుల కాలాన్ని లెక్కించడానికి క్యాలెండర్‌కు బదులుగా చంద్రుడిని ఆధారంగా తీసుకుంటారు. నెలవంక దర్శనంతో ఆరంభం అయ్యే రంజాన్ ఉపవాస దీక్షలను మళ్లీ.. చంద్ర దర్శనం తరువాతే ముగిస్తారు. ఆ మరుసటి రోజే పండగను జరుపుకొంటారు. నెల రోజుల తరువాత కూడా చంద్రుడు కనిపించకపోతే- మరో రోజు ఉపవాస దీక్షలను కొనసాగిస్తారు.

భారత్‌లో శనివారం రాత్రి నెలవంక కనిపించడంతో రంజాన్ మాసం ప్రారంభమైంది. భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షలను చేపట్టారు ముస్లింలు. నెలవంక కనిపించనట్లు ఢిల్లీ జామా మసీదు ఇమామ్‌, లక్నో షాహి ఇమామ్‌ వెల్లడించారు.

రంజాన్ మాసం ప్రారంభమౌతున్న సందర్భంగా ముస్లింలకు పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్,

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రి నారా లోకేశ్ తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

చంద్రబాబు ..

నెల రోజుల పాటు కఠోర ఉపవాస దీక్షలతో చేసే ప్రార్థనలు ఫలించాలని, ఆ అల్లా దయతో అందరికీ మంచి జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ పెట్టారు. ఉపవాస దీక్షలు చేస్తున్న అందరికీ అల్లా దీవెనలు లభించాలని కోరుకుంటోన్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రంజాన్ చాంద్ ముబారక్ అంటూ నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.

రేవంత్ రెడ్డి…

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలిపారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్మాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తాయన్నారు. ముస్లిం సోదరులు రంజాన్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు పొందాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

కెసిఆర్. .

ముస్లిం సోదరులకు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం, దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొదిస్తాయిని అన్నారు.ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప‌దేండ్ల బీఆర్ఎస్ పాల‌నలో పలు కార్యక్రమాల ద్వారా, అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసింద‌ని గుర్తు చేశారు. ముస్లిం సోదరులు రంజాన్‌ పండుగను సంతోషంగా జరుపుకోవాలని, అల్లా దీవెనలు పొందాలని ఆకాంక్షించారు

Leave a Reply