ఉపాధ్యాయ సేవలకు ఘన సన్మానం

  • పదవీ విరమణ పొందిన నందునాయక్‌కు ఘన వీడ్కోలు
  • సేవాభావంతో ఆదర్శ ఉపాధ్యాయుడిగా గుర్తింపు: డిప్యూటీ డీఎంహెచ్‌వో సుధాకర్ నాయక్

జన్నారం, ఆంధ్రప్రభ : ఉపాధ్యాయునిగా మచ్చలేని సేవలు అందించి ఆదర్శంగా నిలిచిన బాదావత్ నందునాయక్ సేవలు చిరస్మరణీయమని మంచిర్యాల జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎల్. సుధాకర్ నాయక్ అన్నారు. నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలంలోని మల్లాపూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించిన నందునాయక్ పదవీ విరమణ సందర్భంగా ఆదివారం జన్నారంలోని జ్యోతి ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నందునాయక్‌కు పూలమాల వేసి, శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తిలో నిజాయితీ, అంకితభావంతో పనిచేసి మంచి పేరు సంపాదించుకున్న వ్యక్తిగా నందునాయక్ నిలిచారని సుధాకర్ నాయక్ కొనియాడారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు రాజేష్ నాయక్ మాట్లాడుతూ, ఉద్యోగుల పదవీ విరమణ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎల్. బక్షి నాయక్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జె. బాల్కోటి, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ బి. స్వరూపరాణి, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు, సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.