HOSTEL | హాజరు వంద శాతం ఉండాలి

- శీతాకాలంలో విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేయాలి
- జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గూగులోత్ దేశీ రామ్ నాయక్
HOSTEL | కురవి, ఆంధ్రప్రభ : శీతాకాలంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, పిల్లల హాజరు వంద శాతం పక్కాగా ఉండేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని జిల్లా ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గూగులోత్ దేశీ రామ్ నాయక్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం మండల కేంద్రంలో ఉన్న గిరిజన ఆశ్రమ (వసతి గృహం) పాఠశాల (బాలికలు)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని విద్యాసంస్థల పరిశీలన చేయాలని ఆదేశించిన నేపథ్యంలో వారు తనిఖీ చేయడం జరిగింది. వసతి గృహంలోని స్టోర్ గది, కిచెన్ షెడ్, డైనింగ్ హాల్, తరగతి గదులు తదితర పరిసరాలను పరిశీలించి సంబంధిత సిబ్బందికి తగు సూచనలు చేశారు. ప్రేయర్ సమయంలో పిల్లలతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్బంగా దేశీ రామ్ నాయక్ మాట్లాడారు.. శీతాకాల నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారం పిల్లలకు వైద్య పరీక్షలు నిర్వహించాలని, వారి మానసిక ఆరోగ్య పరిస్థితులను గమనిస్తూ ఉండాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులో మెలకువలు నేర్పిస్తూ అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో బోధన చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. హెల్త్, ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, శానిటేషన్లపై పిల్లలకు అవగాహన కల్పిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించే విధంగా చూడాలని సూచించారు. భోజనం సిద్ధం చేసే సిబ్బంది తగిన జాగ్రత్తలు వహిస్తూ వేడి ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. ఆయన వెంట ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది ఉన్నారు.

