84 అప్రోచ్ రోడ్ల నిర్మాణం.. కలెక్టర్ డా.సిరి
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : రహదారుల్లో ప్రమాదాలు జరుగకుండా నివారణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా. ఏ.సిరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్(Mini conference) హాల్లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్లాక్ స్పాట్స్(Black Spots)గా గుర్తించిన రహదారి ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగకుండా బారికేడ్స్, రంబుల్ స్ట్రిప్స్, సైన్ బోర్డ్స్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ, నేషనల్ హైవే కర్నూలు, అనంతపురం, కడప ప్రాజెక్ట్ డైరెక్టర్లను ఆదేశించారు..అలాగే పోలీస్ శాఖ ప్రతిపాదించిన విధంగా ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్, నేషనల్ హైవేస్కు సంబంధించిన రోడ్లలో 84 అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరుగకుండా అవగాహన కల్పించాలని ఆర్టీసీ(RTC), రవాణా శాఖల అధికారులకు సూచించారు. ఎల్లమ్మ దేవాలయం దగ్గర జరుగుతున్న అప్రోచ్ రోడ్డు పనులను ఒక నెల లోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పెద్దపాడు నుండి హైదరాబాద్ ఎన్ హెచ్ కు లింక్ చేస్తూ ఔటర్ రింగ్ రోడ్(Outer Ring Road) ఏర్పాటు కు సంబంధించిన ప్రతిపాదనలను అక్టోబర్ 10 వ తేదీ లోపు జనరల్ బాడీ సమావేశంలో ఆమోదం తీసుకుని ప్రభుత్వానికి పంపాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.. అలాగే ఉల్చాల, గాయత్రి ఎస్టేట్ జంక్షన్(Gayatri Estate Junction) అభివృద్ధి పనులను త్వరితగతిన చేపట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు.
అలాగే నగరంలో జరుగుతున్నఇతర సుందరీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ ఆదోని మంత్రాలయం, ఆలూరు తదితర ప్రాంతాల్లో ఉన్న ఆర్ అండ్ బీ రోడ్లలో రాత్రి పూట ప్రమాదాలు జరుగకుండా వెలుతురు ఇచ్చేరోడ్ స్టడ్స్(Road Studs)ను ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బీ ఎస్ఈ కి సూచించారు.
నగరంలో సీసీ కెమెరాల నిర్వహణ పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కర్నూలు మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. అలాగే మరో 135 సీసీ కెమెరాలను త్వరితగతిన ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్పీ మునిసిపల్ కమిషనర్ కు సూచించారు. సమావేశంలో ఆర్ అండ్ బీ ఎస్ఈ మహేశ్వర రెడ్డి, కర్నూల్ మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ(Vishwanatha), డీటీసీ శాంత కుమారి, నేషనల్ హై వే ప్రాజెక్ట్ డైరెక్టర్ లు, పంచాయతీ రాజ్, ఆర్టీసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

