ప్రతి నెలా ఒకటో తేదీ… ప్రజలకు పండుగే !

  • ఇంటి గుమ్మానికే పెన్షన్!
  • చెప్పిందే చేస్తాం… సంక్షేమమే మా బలం!
  • సామాజిక భద్రతను మరింత బలోపేతం చేస్తున్న సీఎం చంద్రబాబు
  • విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని)

విజయవాడ, ఆంధ్రప్రభ : విజయవాడ తూర్పు నియోజకవర్గం నాలుగో డివిజన్ దూల్ పేట లో శనివారం నిర్వహించిన ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ (చిన్ని) పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని) మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకే పెన్షన్లు అందించే విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని అన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను మరింత బలోపేతం చేస్తోందని పేర్కొన్నారు.

పెన్షన్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, సమాజంలోని బలహీన వర్గాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందనే నమ్మకానికి ప్రతీక అని అన్నారు. ప్రతి లబ్ధిదారుడి ముఖంలో ఆనందం చూడటమే ప్రభుత్వానికి నిజమైన సంతృప్తి అని పేర్కొన్నారు. విజయవాడ నగర అభివృద్ధితో పాటు ప్రతి కుటుంబ సంక్షేమమే తమ లక్ష్యమని, ప్రజలకు అవసరమైన ప్రతి సేవను వారి గుమ్మం వద్దకే చేరేలా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎంపీ చిన్ని స్పష్టం చేశారు.

డివిజన్లో వికలాంగుడైన చిన్న బాలుడికి 6000 పెన్షన్ అందిస్తున్నట్లు తెలిపారు అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు హైకోర్టు అడ్వకేట్ లీగల్ సెల్ నాయకులు ఎర్నేని వేదవ్యాస్ డివిజన్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ సురేంద్ర వాసు తదితరులు పాల్గొన్నారు.