Rammohan Naidu | భోగాపురం ఉత్తరాంధ్రకు సింహద్వారం…

ప్రపంచం చూస్తోంది.. ఉత్తరాంధ్ర వైపు
భోగాపురంతో ఉత్తరాంధ్రకు కొత్త దిశ
ఏవియేషన్ హబ్‌గా భోగాపురం


Rammohan Naidu | ఆంధ్రప్రభ, భోగాపురం : ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సింహద్వారంగా నిలుస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. ఉత్తరాంధ్ర బిడ్డగా, దివంగత నేత ఎర్రన్నాయుడు కుమారుడిగా ఈ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చూడడం తనకు ఎంతో గర్వకారణమని చెప్పారు. ఒకప్పుడు ఉపాధి కోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర ప్రాంతాల వైపు చూడాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రపంచమే ఉత్తరాంధ్ర వైపు చూస్తోందని అన్నారు.

ప్రపంచంలోని ఏవియేషన్ వర్క్ ఫోర్స్‌కు శిక్షణ ఇక్కడ అందించబోతున్నారని తెలిపారు భోగాపురం ఎయిర్ పోర్టు ద్వారా ఏపీ అభివృద్ధికి ఉత్తర ద్వారం తెరుచుకుందన్నారు. ఎర్రబస్సు కూడా తిరగని ప్రాంతమని విమర్శలు చేసిన వాళ్లు కళ్లు తెరుచుకని ఇక్కడికి వస్తున్న ఎయిర్ బస్సులను చూడాలన్నారు.

ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎన్నో పవిత్రమైన దేవాలయాలు, అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, గూగుల్, ఆర్సెల్లార్ మిట్టల్, రైల్వే జోన్, మూలపేట పోర్టు వంటివి వస్తున్నాయని తెలిపారు. వికసిత్ భారత్ విజన్ ప్రధాని మోడీ ది, స్వర్ణాంధ్ర విజన్ చంద్రబాబుదని ఈ విజన్ ను సాకారం చేసేలా పని చేద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు. దాదాపు 16 ఎయిర్ పోర్టులను ప్రారంభించాను.. కానీ ఇంతటి ఘనంగా ఏ ఎయిర్ పోర్టు ప్రారంభోత్సవం జరగలేదన్నారు. ఎయిర్ పోర్టుకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడంతో అల్లూరి పేరు ప్రపంచం మొత్తం మార్మోగుతోందన్నారు.

అల్లూరి పేరును అంగీకరించిన కేంద్రానికి ధన్యవాదాలన్నారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు వచ్చాయి… అభివృద్ధిని అందిపుచ్చుకోవాలని, ప్రధాని, ముఖ్యమంత్రి చూపిన మార్గంలో నడుద్దాం… ఉత్తరాంధ్రను ఉత్తమ ఆంధ్రగా తీర్చిదిద్దుతామన్నారు. అసాధ్యమనుకున్న భోగాపురం ఎయిర్ పోర్టును అందించడంతో పాటు.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని వెంట ఉత్తరాంధ్ర యువత నడుస్తుందన్నారు.

భోగాపురం విత్తనం వేసింది చంద్రబాబు నాయుడు… ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్ కావాలని భోగాపురం ఎయిర్ పోర్టు ఆలోచన చేశారన్నారు. గతంలో విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతి రాజు పనులను ప్రారంభించారని,.. నేను కేంద్ర మంత్రిగా ఉండగా దీన్ని ప్రారంభించుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.