కుప్టి పాఠశాలలో బోధనపై ప్రభావం.. విద్యాశాఖ అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు

డిప్యూటేషన్, గైర్హాజరుపై విచారణ జరిపించాలని సర్పంచ్, తల్లిదండ్రుల డిమాండ్

కుబీర్, ఆంధ్రప్రభ : నిర్మల్ జిల్లా కుబీర్ మండలం కుప్టి ప్రాథమికోన్నత పాఠశాలలో విధులు నిర్వహించాల్సిన ఓ స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయురాలు ఎక్కువ కాలంగా విధులకు హాజరు కాకపోవడంతో విద్యార్థుల బోధనపై ప్రభావం పడుతోందని గ్రామ సర్పంచ్, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై పలుమార్లు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని వారు పేర్కొంటున్నారు.

కుప్టి పాఠశాలలో చేరిక.. ఆ తర్వాత గైర్హాజరు

సమాచారం ప్రకారం, రాష్ట్ర విద్యాశాఖ హైదరాబాద్ కార్యాలయంలో డిప్యూటేషన్ (ఫారిన్ సర్వీస్)పై స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేసిన సదరు ఉపాధ్యాయురాలు, ఐదేళ్ల సేవా కాలం పూర్తికావడంతో బదిలీపై 2024 నవంబర్ 11న కుబీర్ మండలంలోని కుప్టి ప్రాథమికోన్నత పాఠశాలలో విధుల్లో చేరారు.

విధుల్లో చేరిన అనంతరం మూడు రోజుల పాటు గైర్హాజరైనట్లు, అనంతరం హాజరు నమోదుపై వివాదం తలెత్తడంతో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారి జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించినట్లు సమాచారం.

బోధనపై ప్రభావం

గ్రామస్థుల కథనం ప్రకారం, ఉపాధ్యాయురాలు విధులకు క్రమం తప్పకుండా హాజరుకాకపోవడంతో పాఠశాలలో బోధన దెబ్బతింది. 2024-25 విద్యా సంవత్సరంలో ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మొత్తం 55 మంది విద్యార్థులకు ఇద్దరు ఎస్‌జీటీలు మాత్రమే బోధించినట్లు వారు తెలిపారు. ఆరో, ఏడో తరగతులకు స్కూల్ అసిస్టెంట్ అందుబాటులో లేకపోవడంతో విద్యా ప్రమాణాలు ప్రభావితమయ్యాయని పేర్కొన్నారు.

2025-26 విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య 56గా ఉండగా, ప్రస్తుతం 2026-27 విద్యా సంవత్సరంలో అది 35కు తగ్గిందని గ్రామస్థులు తెలిపారు. అయితే విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ఇదే ఏకైక కారణమా అనే విషయంపై అధికారిక సమాచారం లేదు.

ఫిర్యాదులు.. స్పందన కోసం ఎదురుచూపులు

ఉపాధ్యాయురాలు విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామ సర్పంచ్, తల్లిదండ్రులు పలుమార్లు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు, మండల విద్యాశాఖ అధికారికి వినతిపత్రాలు సమర్పించినట్లు తెలిపారు.

ఈ అంశంపై స్పందన కోసం కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు సురేష్‌ను ఫోన్ ద్వారా సంప్రదించగా, తాను ఇతర పనుల్లో ఉన్నానని చెప్పి వివరాలు వెల్లడించలేదని పేర్కొన్నారు.

నిబంధనల ప్రకారం ఉపాధ్యాయుల అవసరం

విద్యాశాఖ నిబంధనల ప్రకారం, ప్రాథమిక స్థాయిలో (1 నుంచి 5వ తరగతి వరకు) 20 మందికి పైగా విద్యార్థులు ఉంటే ఇద్దరు ఎస్‌జీటీలు ఉండాలి. ప్రాథమికోన్నత స్థాయిలో (6, 7, 8 తరగతులు) పదిమందిలోపు విద్యార్థులు ఉన్నా ఒక స్కూల్ అసిస్టెంట్ ఉండాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం కుప్టి పాఠశాలలో ప్రాథమిక స్థాయిలో 27 మంది, ప్రాథమికోన్నత స్థాయిలో 8 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం.

డిప్యూటేషన్‌పై ప్రశ్నలు

గ్రామస్థుల కథనం ప్రకారం, అనంతరం సదరు ఉపాధ్యాయురాలిని మామడ మండలం పరిధిలోని పరిమండల్ పాఠశాలకు డిప్యూటేషన్‌పై పంపుతూ జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులకు సంబంధించిన పత్ర సంఖ్య బి6/డబ్ల్యూఏ/2025గా ఉండగా, ఉత్తర్వులపై జారీ తేదీ లేకపోవడంపై వారు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

పరిమండల్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు 2025 ఫిబ్రవరి 28న విధుల్లో చేరినప్పటికీ, అనంతరం క్రమం తప్పకుండా విధులకు హాజరుకాలేదని, 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభంలో జూన్ 15న హాజరై మళ్లీ గైర్హాజరైనట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.

చర్యలు తీసుకోవాలని డిమాండ్

కుప్టి సర్పంచ్ లక్ష్మణ్ (చిన్ను) మాట్లాడుతూ, ఉపాధ్యాయురాలి వ్యవహారశైలిపై పలుమార్లు మండల, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ విచారణ జరిపి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు.

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. సమస్య పరిష్కారం కాకపోతే తల్లిదండ్రులతో కలిసి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

అలాగే, ఈ వ్యవహారంలో ఒక ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకుడు జోక్యం చేసుకుంటున్నారని కూడా సర్పంచ్ ఆరోపించారు. ఈ ఆరోపణలపై సంబంధిత ఉపాధ్యాయురాలు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘం నాయకుడి స్పందన తెలియాల్సి ఉంది.