AP | పట్టిసీమతో డెల్టాకు భరోసా…
కూటమి విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మాజీ మంత్రి దేవినేని ఉమా
గొల్లపూడి లో ఇంటింటికి తెలుగుదేశం ప్రచారంలో దేవినేని ఉమ
ఎల్ నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన
AP | (విజయవాడ, ఆంధ్రప్రభ) : విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం ప్రచార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను కుటుంబ సాధికార సారధుల నుంచి రాష్ట్రస్థాయి నాయకుల వరకు ప్రతి ఒక్కరూ ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
ఎల్ నినో ప్రభావం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకం డెల్టా ప్రాంతాన్ని కాపాడిందని పేర్కొన్నారు. ప్రస్తుతం కూడా రైతులు ప్రభుత్వ సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ వాతావరణ పరిస్థితులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ప్రతి రైతు సాగు చేసే ప్రతి పంటకు తప్పనిసరిగా పంటల భీమా నమోదు చేయించుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల సమయంలో భీమా రైతులకు రక్షణగా నిలుస్తుందని దేవినేని ఉమా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పార్టీ నాయకులు, కుటుంబ సాధికార సారధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వ విజయాలను ప్రజలకు వివరించారు.
