జిల్లాలో 72.54 శాతం మేర ఫారాల డిజిటైజేషన్..
ప్రక్రియలో వచ్చే మూడు రోజులు చాలా కీలకం
ఓటర్లకు విస్తృత అవగాహన కల్పిస్తున్నాం
జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఏ కొండూరు, ఆంధ్రప్రభ : ఎన్టీఆర్ జిల్లాలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఇంటింటి సర్వేను విజయవంతంగా పూర్తి చేయడంలో వచ్చే మూడు రోజులు చాలా కీలకమని.. ఓటర్లకు సహాయసహకారాలు అందించడం ద్వారా ప్రత్యేక అధికారులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ గురువారం ఎ.కొండూరు మండలం, చీమలపాడులో పర్యటించారు. క్షేత్రస్థాయిలో సర్ కార్యకలాపాలను పరిశీలించి.. ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, ఫారాల డిజిటైజేషన్ పనులపై ఆరా తీశారు. అత్యంత పారదర్శకంగా ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీఎల్వోలు అధికారులకు దిశానిర్దేశం చేశారు. డిజిటైజేషన్పై ప్రత్యేకంగా దృష్టిసారించాలని ఆదేశించారు. ఇటు ఓటర్లు, అటు బీఎల్వోలు సహాయసహకారాలు అందించాలని సూచించారు. .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రక్రియను చేపడుతున్నామని తెలిపారు. ఓటర్లకు వివిధ మార్గాల ద్వారా సర్పై అవగాహన కల్పిస్తున్నామని.. ఎన్యూమరేషన్ ఫారాలు బీఎల్వోలకు అందజేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసి ఓటర్లకు సహాయపడుతున్నట్లు తెలిపారు.
72.54 శాతం డిజిటైజేషన్..
జిల్లాలో 12,42,947 (72.54 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ పూర్తయిందని కలెక్టర్ తెలిపారు. తిరువూరులో 1,75,033 (83.87 శాతం) ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ జరగ్గా.. విజయవాడ పశ్చిమలో 1,64,943 (64.19 శాతం), విజయవాడ సెంట్రల్ 1,82,990 (65.87 శాతం), విజయవాడ తూర్పు 1,80,766 (67.02 శాతం), మైలవరం 2,20,238 (77.23 శాతం), నందిగామ 1,60,554 (77.38 శాతం), జగ్గయ్యపేటలో 1,58,423 (76.33 శాతం) మేర ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయినట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
