OnJune19th | యుద్ధానికి.. శాంతి గీతం

OnJune19th | యుద్ధానికి.. శాంతి గీతం

OnJune19th | ఇరాన్, అమెరికా మ‌ధ్య సీజ్ ఫైర్
నాలుగు నెల‌పాటు కొన‌సాగిన వార్‌
14 అంశాల‌తో కూడిన శాంతి ఒప్పందంపై 19 సంత‌కాలు
పాకిస్తాన్, ఖతార్‌ మ‌ధ్య వ‌ర్తిత్వంతో కుదిరిన డీల్
స్విట్జ‌ర్‌ల్యాండ్ వేదిక‌గా సంత‌కాలు చేస్తామ‌న్న అమెరికా, ఇరాన్
ట్రంప్ ప్ర‌క‌ట‌న వెంట‌నే తెర‌చుకున్న హ‌ర్ముజ్ జ‌ల‌సంధి
ఇంజ‌న్‌లు స్టార్ట్ చేయండి అని ఆయిల్ కంపెనీల‌కు ట్రంప్ పిలుపు
యుద్ధం ముగియ‌డంతో ఆయిల్ ధ‌ర భారీగా ప‌త‌నం

OnJune19th | న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : ప్రపంచ దేశాలను నాలుగు నెలలుగా తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న అమెరికా, ఇరాన్ యుద్ధానికి బ్రేక్ పడింది. ఇరు దేశాల మధ్య ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా ధృవీకరించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి ఈ డీల్ ఎంతో సహాయపడుతుందని ట్రంప్ తన ట్రూత్ సోష‌ల్‌ ద్వారా వెల్లడించారు. ఈ నెల 19న స్విట్జర్లాండ్ వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరగనున్నాయి.

పాకిస్తాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వం
ఈ సుదీర్ఘ యుద్ధాన్ని ఆపడానికి పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఖతార్‌ కీలక మధ్యవర్తులుగా వ్యవహరించాయి. రెండు దేశాల ప్రతినిధులతో మాట్లాడి యుద్ధ విరమణకు ఒప్పించాయి. ఈ డీల్ ప్రకారం లెబనాన్ ఫ్రంట్‌తో సహా అన్ని వైపులా జరుగుతున్న సైనిక చర్యలను తక్షణమే, శాశ్వతంగా నిలిపివేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హ‌ర్ముజ్ జలసంధిని అన్ని రకాల అంతర్జాతీయ ఓడల రాకపోకల కోసం 30 రోజుల్లోగా పూర్తిగా తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకుంది. దీనికి బదులుగా ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని అమెరికా వెంటనే తొలగించంది.

అంగీకారం కుదిరిన 14 ముఖ్యమైన అంశాలు
ఇరాన్ అధికారిక వార్తా సంస్థ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. శాంతి ఒప్పందంలో 14 ప్రధానాంశాలపై ఇరు దేశాలు ఒక అవగాహనకు వచ్చాయి. వాటి ప్రకారం.. యుద్ధాన్ని వెంటనే ముగించడం, ఇరాన్ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోకపోవడం, ఇరాన్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అమెరికా సైన్యాన్ని ఉపసంహరించుకోవడం జరుగుతుంది. అలాగే ఇరాన్ ఆయిల్ విక్రయాలపై ఉన్న ఆంక్షలను సడలించి, ఆ డబ్బును ఇరాన్ తిరిగి పొందేలా చూస్తారు.

వీటితో పాటు యుద్ధంలో దెబ్బతిన్న ఇరాన్ పునర్నిర్మాణం కోసం అమెరికా, దాని మిత్రదేశాలు కలిసి దాదాపు 300 బిలియన్ డాలర్ల (సుమారు ₹25 లక్షల కోట్లు) ఆర్థిక సహాయాన్ని అందించనున్నాయి. ఇరాన్ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం తాము ఎప్పటికీ అణు ఆయుధాలను తయారు చేయబోమని హామీ ఇచ్చింది. అలాగే అమెరికా బ్యాంకుల ద్వారా ఫ్రీజ్ అయిన ఇరాన్‌కు చెందిన 24 బిలియన్ డాలర్ల ఆస్తులను విడతల వారీగా ఇరాన్‌కు బదిలీ చేస్తారు. చర్చలు జరుగుతున్న 60 రోజుల పాటు అమెరికా ఎలాంటి కొత్త ఆంక్షలు కానీ, సైనిక చర్యలు కానీ చేపట్టకూడదు.

ఇంకా తేలని అణు వివాదం, యూరేనియం నిల్వలు
ఈ 14 అంశాలపై ప్రాథమిక అవగాహన కుదిరినప్పటికీ, కొన్ని కీలకమైన సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే మిగిలిపోయాయి. ముఖ్యంగా ఇరాన్ దగ్గర ఉన్న అత్యంత ప్రమాదకరమైన యురేనియం నిల్వలను పూర్తిగా నాశనం చేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అయితే.. ఇరాన్ మాత్రం ఆ యురేనియంను నాశనం చేయకుండా, తక్కువ సాంద్రత కలిగిన రూపంలో తమ దేశంలోనే ఉంచుకోవడానికి అనుమతించాలని కోరుతోంది. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య స్పష్టత రాలేదు. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాదీ మాట్లాడుతూ.. అమెరికా ఈ 60 రోజుల్లో తన వాగ్దానాలను ఎలా నిలబెట్టుకుంటుందో చూసిన తర్వాతే తాము తుది ఒప్పందంపై ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

సంతకాల వేడుకకు డోనాల్డ్ ట్రంప్ వెళ్తారా?

స్విట్జర్లాండ్‌లో జరిగే ఈ చారిత్రాత్మక సంతకాల కార్యక్రమానికి అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్ హాజరయ్యే అవకాశం ఉందని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. అయితే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూడా చివరి నిమిషంలో ఈ కార్యక్రమానికి వచ్చే ఛాన్స్ ఉందని సంకేతాలు ఇచ్చారు. కానీ భద్రతా కారణాల దృష్ట్యా, ఫ్రాన్స్‌లో జరగబోయే జీ7 సదస్సు షెడ్యూల్ కారణంగా దీనిపై ఇంకా పూర్తి నిర్ణయం తీసుకోలేదు. సాధారణంగా అమెరికా సీక్రెట్ సర్వీస్ నిబంధనల ప్రకారం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఇద్దరూ ఒకేసారి విదేశీ పర్యటనలకు వెళ్లకూడదు. కాబట్టి ట్రంప్ లేదా జేడీ వెన్స్‌లలో ఎవరో ఒకరు మాత్రమే స్విట్జర్లాండ్ వెళ్లే అవకాశం ఉంది.

ఆయిల్ ధ‌ర‌లు ప‌త‌నం..
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో ఈ ఒప్పందంపై స్పందించారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇకపై ఎలాంటి టోల్ టాక్స్ లు, ఆంక్షలు లేకుండా పూర్తిగా ఓపెన్ అవుతుందని ఆయన ప్రకటించారు. ఇన్నాళ్లూ ఇరాన్‌పై విధించిన యూఎస్ నావికా దిగ్బంధనాన్ని పూర్తిగా తొలగిస్తున్నట్లు ట్రంప్ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల వాణిజ్య నౌకలను ఉద్దేశించి.. ఇక ఆలస్యం ఎందుకు? మీ షిప్‌ల ఇంజిన్లు స్టార్ట్ చేయండి..

ఆయిల్ తరలింపులు మొదలుపెట్టండి అంటూ ట్రంప్ ఇచ్చిన పిలుపు ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో జోష్ నింపింది. ఈ శాంతి ఒప్పందంతో అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు. యుద్ధం ముగిసి, వాణిజ్య మార్గాలు తెరుచుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలు మళ్లీ పుంజుకోనున్నాయి. .కాగా, సోమ‌వారం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు ఒక్కసారిగా పతనం అయ్యాయి. దాదాపు 4 శాతం మేర దిగొచ్చాయి. నిన్న‌టి వ‌ర‌కు 112 డాల‌ర్లుగా ఉన్న బ్యారెల్ చ‌మురు ధ‌ర ఒక్క‌సారి 84 డాల‌ర్ల‌కు ప‌డిపోయింది.. రానున్న రోజుల‌లో ఈ ధ‌ర మ‌రింత త‌గ్గుతుంద‌ని భావిస్తున్నారు.

click here to read భారత దేశ గీతాలాపనతో స్వాగతం

click here to read more