ధరల పెంపు దారుణం

ధరల పెంపు దారుణం

ఆలేరు, ఆంధ్రప్రభ: డీజిల్, పెట్రోల్, నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజల నడ్డి విరిచిందని యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ నాయకుడు, పటేల్‌గూడెం మాజీ ఎంపీటీసీ పిక్క శ్రీనివాస్ అన్నారు.

బుధవారం ఆయన మాట్లాడుతూ.. దారిద్య్రరేఖకు దిగువనున్న ప్రజలు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెంచుతున్న ధరలతో బతుకు పోరాటం చేస్తూ విలవిలలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా కొంతకాలంగా జరుగుతున్న యుద్ధం పేరుతో అధిక ధరల భారం మోపడంతో ప్రజల ఆగ్రహానికి మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం గురవుతోందని అన్నారు.

ప్రజల కనీస ఆర్థిక స్థాయిని కూడా గమనించకుండా ఇష్టం వచ్చినట్లు ధరలను పెంచుతున్న పాలకులు ఇప్పటికైనా వాస్తవ పరిస్థితులను గమనించాలని పిక్క శ్రీనివాస్ సూచించారు. పెట్రోల్, డీజిల్‌తో పాటు నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.