జెండా ఆవిష్కరణలతో సందడి..

జెండా ఆవిష్కరణలతో సందడి..
చిట్యాల మండలంలో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు!
చిట్యాల, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను చిట్యాల మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీలు, రాజకీయ పార్టీల కార్యాలయాలు, విద్యాసంస్థల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి వేడుకలను జరుపుకున్నారు.
మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వసంతరావు, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జయశ్రీ, చిట్యాల పోలీస్ స్టేషన్లో సీఐ మల్లేష్ జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
అలాగే మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్పర్సన్ గుమ్మడి శ్రీదేవి, పీఏసీఎస్ కార్యాలయంలో చైర్మన్ కుంభం క్రాంతికుమార్ రెడ్డి, చిట్యాల గ్రామపంచాయతీలో సర్పంచ్ తౌటం లక్ష్మి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీ కార్యాలయాల్లో వరుసగా అధ్యక్షులు గూట్ల తిరుపతి, అల్లం రవీందర్, బుర్ర వెంకటేష్ గౌడ్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, గురుకుల విద్యాసంస్థల్లో ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాలను ఆవిష్కరించగా, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సర్పంచులు జెండా వందనం నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరవీరులను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ వేడుకలు మండల వ్యాప్తంగా అంగరంగ వైభవంగా, ప్రశాంత వాతావరణంలో ముగిశాయి.
