Fire Accident | అంత్యోదయ ఎక్స్ప్రెస్ బోగీ పూర్తిగా దగ్ధం

Fire Accident | ఆంధ్రప్రభ, వెబ్డెస్క్ : బీహార్ లోని మధుబని రైల్వే స్టేషన్లో ఇవాళ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. జయనగర్-ఉద్నా అంత్యోదయ ఎక్స్ప్రెస్కు చెందిన ఓ ఖాళీ బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగి క్షణాల్లో మొత్తం బోగీని ఆవరించాయి. ఈ ఘటనతో రైల్వే స్టేషన్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ప్లాట్ఫామ్ నంబర్-3పై షంటింగ్ పనుల కోసం రైలు నిలిపి ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. మంటలు వేగంగా వ్యాపించడంతో బోగీ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదాన్ని గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
సుమారు పది అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలానికి చేరుకుని గంటపాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఈ ఘటనపై సమస్తిపూర్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ జ్యోతి ప్రకాష్ మిశ్రా స్పందిస్తూ.. ప్లాట్ఫామ్ ప్రాంతాన్ని ఖాళీ చేయించి భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోందని, అసాంఘిక శక్తుల ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేపడుతున్నట్లు వెల్లడించారు. 2022లో ఇదే ప్లాట్ఫామ్పై నిలిచిన స్వతంత్ర సేనాని ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం సంభవించి ఐదు కోచ్లు దగ్ధమైన ఘటనను అధికారులు గుర్తు చేస్తున్నారు.
