నేడు హైదరాబాద్‌ ఛాంపియన్స్‌-ఖమ్మం ఏసెస్‌ ఫైనల్‌ పోరు..

నేడు హైదరాబాద్‌ ఛాంపియన్స్‌-ఖమ్మం ఏసెస్‌ ఫైనల్‌ పోరు..

ఉప్పల్‌లో క్రికెట్‌ జాతర

ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ వేదికగా జరుగుతున్న టోర్నీకి నేడు తెరపడనుంది. హైదరాబాద్‌ ఛాంపియన్స్‌, ఖమ్మం ఏసెస్‌ జట్ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ప్రారంభం కానుంది. టైటిల్‌ కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

ఫైనల్‌కు ముందు సాయంత్రం 5.30 గంటలకు టోర్నీ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

టోర్నీ బ్రాండ్‌ అంబాసిడర్‌ విజయ్‌ దేవరకొండ కూడా ముగింపు వేడుకల్లో పాల్గొని అభిమానులను అలరించనున్నారు. అలాగే ప్రముఖ గాయకుడు రాహుల్‌ సిప్లిగంజ్‌ బృందం ప్రత్యేక సంగీత ప్రదర్శన ఇవ్వనుండడంతో అభిమానులకు వినోదం రెట్టింపు కానుంది.

ముగింపు వేడుకల అనంతరం జరిగే ఫైనల్‌ మ్యాచ్‌పై ఇప్పటికే క్రికెట్‌ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. టైటిల్‌ను ఎవరు కైవసం చేసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.