పూలే ఆశయాలే మా ఎజెండా…

పూలే ఆశయాలే మా ఎజెండా…
కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో : జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన ఆశయాలను కూటమి సర్కారు ముందుకు తీసుకువెళ్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం నగరంలోని పొన్నాడ బ్రిడ్జి కూడలి వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి కేంద్రమంత్రి నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే కేవలం ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందిన వ్యక్తి కాదని.. ఆయన ఆశయాలు రెండు శతాబ్దాలుగా ప్రపంచానికి ఆధారంగా నిలుస్తున్నాయని అన్నారు.
సమాజంలో సమానత్వానికి, వెనుకబడిన తరగతుల్లో విద్య ద్వారా మార్పు కోసం ఆయన చేసిన కృషి నేటి సమాజానికి ఆదర్శం అని అన్నారు. మహిళల పాఠశాలను ఆనాడే ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడ్డారానికి తెలిపారు. అనాడు ఎన్టీఆర్, నేడు చంద్రబాబు నాయుడు.. పూలే ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ అజెండా పూలే ఆశయాలే అని స్పష్టం చేశారు. అన్ని కులాలకు కార్పొరేషన్ ద్వారా తోడ్పాటు అందిస్తున్నట్టు స్పష్టం చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ఒక బీసీ అవ్వడం మనందరి అదృష్టం అని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఎన్.సి.బి.సి నేషనల్ కమీషన్ ను పార్లమెంట్ లో పాస్ చేయించి చట్టబద్ధత కల్పించడం ఎన్డీయే సర్కారు నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ప్రజా సంఘాల ప్రతినిధులు, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
