Vijayawada | ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న నిర్మాణానికి భువ‌నేశ్వ‌రి భూమి పూజ‌

విజ‌య‌వాడ : విజ‌య‌వాడ నగరంలో ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ భవన్ నిర్మాణానికి ఇవాళ‌ భూమిపూజ జరిగింది. విజయవాడ టీచర్స్‌ కాలనీలోని సాయిబాబా గుడి వీధిలో భవన నిర్మాణానికి ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి శంకుస్థాపన చేశారు. ఏపీలో ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ సేవా కార్యకలాపాలను విస్తరించే లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేపట్టారు. జీప్లస్‌ 5 అంతస్తులతో అధునాతన భవనాన్ని నిర్మించనున్నారు. ఇదే భవనంలో తలసీమియా కేర్‌ సెంటర్, రక్త నిధి కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌ (చిన్ని) తదితరులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా భువ‌నేశ్వ‌రి మాట్లాడుతూ… సేవాభావంతో సమాజానికి అవసరమైన పనులు చేసేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్‌ ఎప్పుడూ ముందుంటుందని నారా భువనేశ్వరి తెలిపారు. రక్తదానంతో పాటు తలసీమియా వ్యాధితో బాధపడే చిన్నారుల్ని ఆదుకునే లక్ష్యంతో ఇక్కడ సేవలు అందిస్తామన్నారు. అత్యవసర వైద్య సేవలకు 24గంటలూ అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

‘2026 ఫిబ్రవరిలో విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. విద్య, వైద్య సేవా కార్యక్రమాలు రాష్ట్రంలో మరింత విస్తృతం చేసే లక్ష్యంతో భవన నిర్మాణం చేపట్టాం. సమాజానికి తిరిగి ఇవ్వాలని దాతృత్వం చాటుకునే వారు మాతో చేతులు కలపాలని కోరుతున్నాం. 25 ఏళ్లుగా నిరంతర సేవలు అందిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా హైదరాబాద్‌లో ప్రారంభమైన ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలు వివిధ ప్రాంతాలకు విస్తరిస్తున్నాం. నైపుణ్యం, శిక్షణ ద్వారా మహిళలు, నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. నిరుపేద విద్యార్థులు ఎందరికో ఉచిత విద్య అందిస్తున్నాం. ఎక్కడ విపత్తులు వచ్చినా సేవలు అందించేందుకు ట్రస్ట్ ముందుంటోంది. న్యూట్రిఫుల్ యాప్ ద్వారా డైట్ వివరాలు అందిస్తున్నాం. రక్తదానాన్ని ప్రతి ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని కోరుతున్నాం.’ అని భువ‌నేశ్వ‌రి పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *