19 stations | గుంటూరు టూ.. కనిగిరి

19 stations | గుంటూరు టూ.. కనిగిరి
త్వరలో పట్టాలెక్కనున్న కొత్త ట్రైన్ !
3.25 గంటలకు చేరుకునేలా రూట్ మ్యాప్ సిద్ధం….!?
169 కిలోమీటర్ల దూరం…17 స్టేషన్లలో హాల్ట్..
19 stations | పల్నాడు ప్రతినిధి ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కీలకమైన నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పనులు వేగవంతం చేసి ఉమ్మడి ప్రకాశం జిల్లా, ప్రస్తుతం మార్కాపురం జిల్లా కనిగిరి వరకు పనులు పూర్తి చేశారు. ప్రస్తుతం పామూరు వైపుగా పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కనిగిరి వరకు రైల్వే లైన్ పనులు పూర్తికావడంతో అక్కడి వరకు రైళ్లు నడపాలని ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులతో పాటుగా స్థానికులు రైల్వే శాఖకు విన్నవించారు. కనిగిరి వాసుల ఎన్నో ఏళ్ల కలను నిజం చేసే దిశగా ఓ ముందడుగు పడింది.
19 stations | తెరపైకి ప్రతిపాదనలు,,
నడికుడి టూ శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్లో కనిగిరి వరకు ప్యాసింజర్ రైలును నడిపేందుకు ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. గుంటూరు నుంచి గుండ్లకమ్మ మీదుగా కనిగిరి వరకు ఈ రైలును నడిపేందుకు గుంటూరు రైల్వే డివిజన్ అధికారులకు ప్రతిపాదనలు పంపించారు. ఏప్రిల్ 24న ఆ వివరాలు అధికారుల దగ్గరకు చేరాయి. తాజా ప్రతిపాదనల ప్రకారం వారంలో ఆరు రోజుల పాటూ గుంటూరు నుంచి కనిగిరి వరకు ఈ కొత్త సర్వీస్ను నడపాలని ప్రతిపాదించారు.
నడికుడి టూ శ్రీకాళహస్తి కొత్త రైల్వే లైన్లో కనిగిరి వరకు రైలును నడపాలని గతంలోనే ఆ ప్రాంత ప్రజా ప్రతినిధులు, స్థానిక ప్రజలు రైల్వే అధికారులకు విన్నవించారు. ఇటీవల రైల్వే అధికారుతో మాట్లాడటంతో సానుకూలంగా స్పందించారు. కనిగిరి రైల్వే స్టేషన్ పనులు పూర్తికావడం, ప్రయాణికులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో ఎలాంటి ఇబ్బందులు లేవు అంటున్నారు.
19 stations | ట్రయల్ రన్ పూర్తి..
ఇప్పటికే ట్రయల్ రన్ కూడా పూర్తి చేయడంతో.. కొత్తగా ప్యాసింజర్ రైలును కనిగిరి వరకు నడిపేందుకు దాదాపుగా లైన్ క్లియర్ అయినట్లేనని చెబుతున్నారు. కనిగిరి నుంచి ప్యాసింజర్ రైలు ప్రారంభమైతే ఆ ప్రాంతం నుంచి రాజధాని ప్రాంతమైన గుంటూరుకు కనెక్టివిటీ కూడా పెరుగుతుందంటున్నారు. కనిగిరి మాత్రమే కాదు పొదిలి, దర్శి ప్రాంతాల ప్రజలకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటుంది. మొత్తం మీద మార్కాపురం, పశ్చిమ ప్రకాశం జిల్లావాసుల ఎన్నో ఏళ్ల కల నెరవేరబోతోంది.
19 stations | ఈ రైలు ప్రయాణం ఇలా..
గుంటూరు జంక్షన్ నుంచి ఉదయం 7:00 గంటలకు బయల్దేరి కనిగిరికి ఉదయం 10:25 గంటలకు చేరుకునే విధంగా టైమింగ్స్ రూపొందించారు. తిరుగు ప్రయాణ సమయాలపై కూడా అధికారులు చర్చలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ రైలు మార్గమధ్యంలో 17 స్టేషన్లలో ఆగేలా ప్రణాళికను తయారు చేశారు.
నల్లపాడు, పేరేచర్ల, వేములూరిపాడు, ఫిరంగిపురం, నుదురుపాడు, సాతులూరు, నరసరావుపేట, మునుమాక, సంతమాగులూరు, శావల్యాపురం, వినుకొండ, చీకటిగలపాలెం, గుండ్లకమ్మ, దర్శి, రాజంపల్లి, మల్లవరం, పొదిలి వంటి స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. ప్రతి స్టేషన్లో 1 నుంచి 2 నిమిషాలు ఆగుతుంది. గుంటూరులో బయల్దేరి, కనిగిరి వరకూ సాగుతుంది. ఈ రెండు స్టేషన్లను కూడా కలుపుపుకుంటే మొత్తం 19 స్టేషన్లకు రైలు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
CLICK HERE TO READ MORE : 25percent | ఈయూ దేశాలపై.. ట్రంప్ కన్నెర్ర !
