సంగారెడ్డిలో పని చేయడం గొప్ప అనుభూతి

సంగారెడ్డిలో పని చేయడం గొప్ప అనుభూతి
- కలెక్టర్ పి.ప్రావీణ్య
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి జిల్లాలో విధులు నిర్వహించడం ఎంతో గొప్ప అనుభూతిని కలిగించిందని, జిల్లాతో ఏర్పడిన అనుబంధం ఎన్నటికీ మర్చిపోలేనిదని ఇటీవల బదిలీపై వెళ్లిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. రహదారులు, భవనాల ప్రత్యేక కార్యదర్శిగా ప్రావీణ్య బదిలీపై వెళ్లిన సందర్భంగా గురువారం రాత్రి కలెక్టరేట్ ఆడిటోరియంలో ఆమెకు ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇదే వేదికపై నూతన జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్కు స్వాగత కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొని, బదిలీ పై వెళ్లిన కలెక్టర్ ప్రావీణ్య సేవలను కొనియాడుతూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రావీణ్య మాట్లాడుతూ, తాను జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కింది స్థాయి ఉద్యోగి నుంచి ప్రతి శాఖాధికారి వరకు అందరూ సంపూర్ణ సహకారం అందించారని తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో అందరి సహకారం ఎంతో కీలకంగా నిలిచిందన్నారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను ఎలాంటి ఆటంకాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించగలిగామని చెప్పారు.
సంగారెడ్డి జిల్లాకు సమర్థవంతమైన అధికారి కలెక్టర్గా రావడం సంతోషకరమని, ఆయన నాయకత్వంలో జిల్లా మరింత అభివృద్ధి సాధిస్తుందని అన్నారు. అధికారులు ఇదే సమన్వయంతో నూతన కలెక్టర్కు సహకరించాలని సూచించారు. నూతన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ, ప్రావీణ్య జిల్లా కలెక్టర్గా తనదైన ప్రత్యేక ముద్ర వేశారని కొనియాడారు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలిపేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్య సాధనకు అధికారులు సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అదనపు కలెక్టర్లు ఆర్డీ మాధురి, ఆర్. పాండు, జిల్లా అధికారులు, ఆర్డీవోలు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ప్రావీణ్యతో కలిసి పనిచేసిన అనుభవాలను గుర్తుచేసుకున్నారు. ఆమె సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానాలు అలంకరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ ఉమాహారతి, సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి గున్నాల రాజేందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఉద్యోగులు, రెవెన్యూ, ట్రెసా యూనియన్ అధ్యక్షుడు గంగాధర్, మన్నె కిరణ్ కుమార్ టీఎన్జీఓ తదితర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
