Tirupathi | కార్మికుల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యం … మంత్రి వాసంశెట్టి సుభాష్

ఈఎస్ఐ వైద్య సేవలను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు
త్వరలోనే కార్మికులకు అందుబాటులోకి స్విమ్స్ రెఫెరల్స్
ఖాళీగా నర్సింగ్ , పారా మెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు
రాష్ట్ర కార్మిక, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్
తిరుపతి ఈఎస్ఐ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు

తిరుపతి ప్రతినిధి (ఆంధ్రప్రభ): రాష్టంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర కార్మిక, ఫ్యాక్టరీలు, బీమా వైద్య సేవల శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తిరుపతి కార్మిక రాజ్య బీమా (ఈఎస్ఐ) ఆసుపత్రిని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ బ్లాక్, అత్యవసర విభాగం, ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం, ఇతర విభాగాలను తనిఖీ చేశారు. గత సంవత్సరం నవంబర్‌లో ఆసుపత్రి సందర్శనకు వచ్చినప్పుడు వున్న అవుట్ పేషెంట్స్ నమోదు సంఖ్య 150 నుంచి ప్రస్తుతం 350 వరకు పెరగడం, ఇన్ పేషెంట్స్ అడ్మిషన్స్ సంఖ్య 30 నుంచి 53 వరకు పెరగడంపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.

సూపరింటెండెంట్ శ్యాంబాబుకు సన్మానం
సుమారు 5 లక్షల సొంత ఖర్చుతో ల్యాబ్ కిట్స్, రీ ఏజెంట్స్, ఇతర పరికరాలను సమకూర్చడంపై, ఇతర సేవలు సమకూరడంపై ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్యాంబాబును అభినందిస్తూ దుస్సాలువతో సన్మానించారు. రాష్ట్రంలోని ఇతర ఆసుపత్రులు, డిస్పెన్సరీలు తిరుపతి ఆసుపత్రిని ఆదర్శంగా తీసుకొని కార్మికులకు మెరుగైన సేవలు అందించాలని మంత్రి పిలుపునిచ్చారు. గత ఆరు సంవత్సరాలకు పైగా రాయలసీమ, నెల్లూరు లాంటి జిల్లాల ఈఎస్ఐ కార్మికులకు అందని ద్రాక్షగా ఉన్న తిరుపతి స్విమ్స్ ఆసుపత్రి సెకండరీ, టెరిషరీ రెఫరల్ వైద్య సేవలు మరి కొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. ఇందుకు ప్రత్యేక కృషి చేసిన రాష్ట్ర బీమా వైద్య శాఖ డైరెక్టర్ వి.ఆంజినేయులు, ఈఎస్ఐ కార్పొరేషన్ సంస్థ విజయవాడ రీజినల్ డైరెక్టర్, తిరుపతి ప్రాంతీయ అధికారులకు అభినందనలు తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఈఎస్ఐ ఆసుపత్రుల్లో కార్మికులకు మెరుగైన ల్యాబ్ సర్వీస్‌లు, ఇన్ పేషెంట్స్ సేవలు అందించేందుకు చర్యలు తీసుకొంటున్నట్టు మంత్రి సుభాష్ పేర్కొన్నారు. అలాగే, రాష్ట్ర బీమా వైద్య శాఖలో గత 15 ఏళ్లుగా భర్తీ కి నోచుకోని నర్సింగ్, పారా మెడికల్ పోస్టుల భర్తీ కి చర్యలు తీసుకొంటున్నట్టు ఆయన చెప్పారు. ఈఎస్ఐలో ఎటువంటి అలసత్వం సహించమని, అలాగే కష్టపడి సంస్థ అభివృద్ధి చేసేవారిని మరిచేది లేదని ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి తన వైపు నుంచి సమకూర్చి మళ్లీ కలుస్తానని చెప్పారు. ఈ తనిఖీ సందర్బంగా మంత్రి వెంట ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ శ్యాంబాబు, సీఎస్ఆర్ఎంఓ ఏవీఎస్ ప్రసాద్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *