- రేపు సౌదీ అరేబియాలో ఇరుదేశాల మధ్య పీస్ టాక్స్
- అమెరికా మధ్య వర్తిత్వంలో యుద్దం విరమణ చర్చలు
- హాజరుకానున్న రెండు దేశాల ఉన్నతస్థాయి బృందాలు
వాషింగ్టన్, ఆంధ్రప్రభ : గత మూడేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా అడుగులు వేస్తోంది. ఇరు దేశాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించేందుకు అమెరికా ఉన్నతాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సౌదీ అరేబియా వేదికగా కానుంది. యుద్ధానికి ముగింపు పలకాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ను అమెరికా ఒప్పించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కీలక చర్చల కోసం జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్జ్ , విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్ సౌదీ అరేబియాకు వెళ్లనున్నారు.. రేపు ఈ చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలలో పాల్గొనేందుకు ఇటు రష్యా, అటు ఉక్రెయిన్ కు చెందిన ఉన్నతాధికారులు బృందం ఇప్పటికే సౌదీకి బయలుదేరినట్లు చెబుతున్నారు..
శాంతి చర్చలలో ఉక్రెయిన్ ..
ఇక ఇదే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. యుద్ధానికి సంబంధించి తాము జరిపే చర్చల్లో రష్యాతో పాటు ఉక్రెయిన్ను భాగస్వామిని చేస్తామని ట్రంప్ తెలిపారు. సౌదీ అరేబియాలో జరిగే చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ లేదా ఆయన ప్రతినిధులు హాజరవుతారా అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాము ఉన్నత స్థాయి అధికార బృందాన్ని చర్చల కోసం పంపుతామని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు..
జెలెన్ స్కీ, పుతిన్ లతో ట్రంప్ ఫోన్ టాక్స్..
ఇది ఇలా ఉంటే గత వారం రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై ట్రంప్ ఫోన్లో రష్యా అధ్యక్షుడు పుతిన్తో సుదీర్ఘచర్చలు జరిపారు. దాదాపు 90 నిమిషాల పాటు సంభాషించినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రష్యాతో జరిపే చర్చల్లో అమెరికా తమను కూడా భాగస్వామిని చేస్తే బాగుండేదన్నారు. అమెరికా మద్దతు లేకుండా తాము రష్యాను ఎదుర్కోలేమని, తాము ఎక్కువ కాలం జీవించలేమని సంచలన వ్యాఖ్యలు చేశారు. యూరప్కు ఎప్పటికైనా రష్యాతో ముప్పు పొంచి ఉందని జెలెన్స్కీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడితో ఫోనో లో మాట్లాడారు.. ముందు శాంతి చర్చలలో పాల్గొంటే అన్ని విషయాలలోనూ అవగాహన వస్తుందని అన్నారు..