Odisha | కూంబింగ్ లో పేలిన ఐఈడి – ఎఎస్ఐ దుర్మరణం

భువనేశ్వర్ : ఒడిశాలోని (Odisha ) సుందర్గఢ్ జిల్లాలో (Sundargarh ) మావోయిస్టుల కోసం కూంబింగ్ (Cubing) నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్ అధికారి (CRPF Officer ) ప్రాణాలు కోల్పోయాడు. అప్రమత్తమైన ఒడిశా పోలీసులు.. ఐఈడీ (IED) పేలిన పరిసర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. మృతి చెందిన సీఆర్పీఎఫ్ ఆఫీసర్ను ఏఎస్ఐ సత్యబాన్ కుమార్ సింగ్(34)గా గుర్తించారు. తీవ్ర గాయాలపాలైన కుమార్ సింగ్ను రూర్కేలాలోని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. కుమార్ సింగ్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని ఖుషినగర్ జిల్లా. రూర్కేలాలోని కే బాలంగ్ గ్రామ సమీపంలోని అడవుల్లో సీఆర్పీఎఫ్ జవాన్లు, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ పోలీసులు కలిసి కూంబింగ్ నిర్వహిస్తుండగా ఐఈడీ పేలింది. ఈ ఘటన శనివారం ఉదయం 6 గంటలకు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
