Sangareddy ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం
Sangareddy ప్రజాస్వామ్యంలో ఓటు బలమైన ఆయుధం
సంగారెడ్డి ప్రతినిధి (Sangareddy), ఆంధ్రప్రభ:
ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత బలమైన ఆయుధమని డీసీసీ అధ్యక్షురాలు, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో ఆదివారం టీపీసీసీ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనున్న ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ బీఎల్ఏలకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా పార్టీ కార్యకర్తలు, బీఎల్ఏలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు.
జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై బీఎల్ఏలు పూర్తి అవగాహన కలిగి ప్రజలకు సరైన సమాచారం అందించాలని అన్నారు. తప్పులు లేని ఓటరు జాబితా రూపొందేందుకు కృషి చేయడంతో పాటు అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, ట్రైనర్ రాజీవ్, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఫహీమ్, టీపీసీసీ సభ్యులు శ్రీనివాస్, డీసీసీ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు పాల్గొన్నారు.
