RIMS Dental | 20 మంది విద్యార్థులకు అస్వస్థత

RIMS Dental | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా రిమ్స్ డెంటల్ కాలేజీలో ఫుడ్ పాయిజనింగ్ ఘటన కలకలం రేపింది. క్యాంటీన్‌లో వడ్డించిన ఆహారం కలుషితం కావడంతో దాదాపు 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఓ టీడీపీ నాయకుడు నిర్వహిస్తున్న క్యాంటీన్‌లోనే కలుషిత ఆహారం వడ్డించారని ఆరోపిస్తూ, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతున్నారు. ఫుడ్ పాయిజనింగ్‌కు గల అసలు కారణాలపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఆహార నమూనాలను పరీక్షలకు పంపించే అవకాశమున్నట్లు సమాచారం.