పాట్నా : ఆపరేషన్ సిందూర్ సమయంలో బిఎస్ఎఫ్ శౌర్యం, ధైర్యాన్ని ప్రపంచం చూసిందని ప్రధాని మోడీ చెప్పారు. మాతృభూమికి సేవ చేయడమనే పవిత్ర కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, ఈ నెల 10న సరిహద్దులో బీఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ తన ప్రాణాలను అర్పించారని కొనియాడారు. ఈ బిహార్ కుమారునికి గౌరవపూర్వక నివాళి అర్పిస్తున్నానన్నారు.
బిహార్ లో ఇవాళ పర్యటించిన ఆయన ఈ సందర్భంగా కరకట్లో ప్రధాని రూ.48,520 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారు. ఎన్ హెచ్ –22లోని పట్నా–గయా–దోభి సెక్షన్ను నాలుగు లేన్లుగా మార్చడం, ఎన్ హెచ్ –27లోని గోపాల్గంజ్ టౌన్లో దాదాపు రూ.5,520 కోట్ల విలువైన ఎలివేటెడ్ హైవే.. గ్రేడ్ మెరుగుదలను మోడీ ప్రారంభించారు. వీటితో పాటు, సోన్ నగర్- మహ్మద్ గంజ్ మధ్య రూ.1,330 కోట్లతో నిర్మించిన మూడో రైలు మార్గాన్ని జాతికి అంకితం చేశారు.
ఇంకా తూర్పు భారతదేశానికి ఇంధన భద్రతను చేకూర్చే లక్ష్యంతో ఔరంగాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన రూ.29,930 కోట్లకు పైగా విలువైన నబీనగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ స్టేజ్-II (3×800 MW)కు కూడా ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు.
అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. పాకిస్థాన్ సహా మొత్తం ప్రపంచం భారతదేశ కుమార్తెల సిందూర శక్తిని చూశాయన్నారు. ఇది మన అంబులపొదిలో ఉన్న ఒక బాణం మాత్రమే అని వారు అర్థం చేసుకోవాలన్నారు. ఉగ్రవాదంపై భారతదేశం చేస్తున్న పోరాటం ఆగలేదని, ఉగ్రవాదం మళ్లీ తలెత్తితే, అది ఏ కలుగులో దాక్కున్నా.. భారతదేశం బయటకు లాగి అణచివేస్తుందని తేల్చి చెప్పారు.
మావోయిస్ట్ చరిత్ర ఇక గతమే ..
గడిచిన సంవత్సరాల్లో హింస, అశాంతిని వ్యాప్తి చేసే వారిని మనం ఎలా నిర్మూలించామన్న దానికి బిహార్ ప్రజలే ప్రత్యక్ష సాక్షులని ప్రధాని మోడీ అన్నారు. ‘కొన్నేళ్ల క్రితం ససారాం, దాని సమీప జిల్లాల్లో నక్సలిజం ఎంత ప్రబలంగా ఉండేదన్న విషయాన్ని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. మావోలకు బాబాసాహెబ్ అంబేద్కర్పై నమ్మకం లేదన్నారు. అటువంటి సంక్లిష్ట పరిస్థితులలో కూడా, సీఎం నితీష్ కుమార్ ఇక్కడ అభివృద్ధి కోసం తన వంతు ప్రయత్నం చేశారని ప్రశంసించారు. 2014కి ముందు 75కి పైగా జిల్లాలు నక్సల్ ప్రభావితమైనవి. ఇప్పుడు వాటి సంఖ్య కేవలం 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. మావోయిస్టు హింస పూర్తిగా నిర్మూలించబడే రోజు ఎంతో దూరంలో లేదు” అని మోడీ అన్నారు.
