సర్పంచ్ జాడి లక్ష్మికి క్షమాపణ చెప్పాలి
హరీష్ గౌడ్పై తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం ఆగ్రహం
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : నెన్నెల మండలంలోని జోగాపూర్–మైలారం బీటీ రోడ్డు పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రోటోకాల్ను పాటించకుండా గొల్లపల్లి గ్రామ దళిత మహిళా సర్పంచ్ జాడి లక్ష్మిని అవమానించారని ఆరోపిస్తూ, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ బొమ్మెన హరీష్ గౌడ్ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
మంగళవారం బెల్లంపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాలాలి నర్సయ్య, రాష్ట్ర కార్యదర్శి గోమాస రాజం, జాడి రాంచందర్, గొల్లపల్లి సర్పంచ్ జాడి లక్ష్మి, మాజీ ఎంపీపీ గోమాస శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు చదువుల వెంకటరమణ మాట్లాడారు.
ఇటీవల ఎమ్మెల్యే గడ్డం వినోద్ పాల్గొన్న జోగాపూర్–మైలారం బీటీ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమానికి సర్పంచ్ జాడి లక్ష్మిని ఆహ్వానించినప్పటికీ, ఆమె చేత పనులు ప్రారంభించకుండా ఎన్నికల్లో ఓటమి చెందిన దుర్గం ప్రసాద్తో ప్రారంభోత్సవం నిర్వహించడం దళిత మహిళా ప్రజాప్రతినిధిని అవమానించడమేనని ఆరోపించారు.
గ్రామ సర్పంచ్కు ప్రోటోకాల్ ప్రకారం ఇవ్వాల్సిన గౌరవాన్ని ఉద్దేశపూర్వకంగా నిరాకరించారని విమర్శించారు. ఈ విషయాన్ని వెంటనే ఎమ్మెల్యే గడ్డం వినోద్ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదని, దళిత మహిళా సర్పంచ్ అవమానానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం విచారకరమని పేర్కొన్నారు.
హరీష్ గౌడ్ వెంటనే సర్పంచ్ జాడి లక్ష్మికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో ఆయన నివాసాన్ని ముట్టడించి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అలాగే ఎమ్మెల్యే పేరు చెప్పి మండలంలో జరుగుతున్నట్లు ఆరోపిస్తున్న డబ్బుల వసూళ్ల వ్యవహారంపై కూడా పూర్తి వివరాలను ప్రజల ముందుంచుతామని తెలిపారు.
ఈ సమావేశంలో నేతకాని సంక్షేమ సంఘం నాయకులు జాడి నారాయణ, బెడ్డల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
