ఓటు విలువను చాటిచెప్పిన విద్యార్థులు

ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ ప్రధాన ఎన్నికల అధికారిగా,ఒక విద్యార్థి కలెక్టర్‌గా బాధ్యతలు

బాల్కొండ, ఆంధ్రప్రభ : ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని బాల్కొండ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల,కళాశాలలో శనివారం విద్యార్థులకు ఓటు హక్కు ప్రాధాన్యం,ఎన్నికల విధి–విధానాలపై అవగాహన కల్పించేందుకు మాదిరి ఎన్నికలను నిర్వహించారు.
ఈ సందర్భంగా సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు విద్యార్థులకు ఓటు విలువ,ఎన్నికల నిర్వహణ విధానాలను వివరించారు. అనంతరం విద్యార్థులే ఓటర్లుగా మారి తమ ఓటు హక్కును వినియోగించుకుని విద్యార్థి నాయకులను ఎన్నుకున్నారు.

ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ప్రసాద్ ప్రధాన ఎన్నికల అధికారిగా,ఒక విద్యార్థి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.పాఠ్యాంశాలతో పాటు ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల ప్రక్రియపై అవగాహన కల్పించడం విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందించేందుకు దోహదపడుతుందని కళాశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.
విద్యార్థులు సమాజాన్ని అవగాహన చేసుకున్నప్పుడే సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ గణేష్, ఉపాధ్యాయులు విజయలక్ష్మి, రవి,శైలజ, పాషా తదితరులు పాల్గొన్నారు.