కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై జస్టిస్ చంద్ర ఘోష్ కమిషన్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు జారీ చేసిన నోటీసులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఖండించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నోటీసులు జారీ చేసిందని, ఇది చట్టపరమైన విషయంగా కాకుండా, పూర్తిగా రాజకీయ కక్షతో, కుట్రతో జారీ చేసిందని ఆరోపించారు.
ఈ సందర్భంగా కవిత ఎక్స్ వేదికగా మండిపడ్డారు. – “కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం నిర్మాణం కాదు, అది తెలంగాణ ప్రజల భవిష్యత్తు. గోదావరి నీటిని ఎత్తిపోతల ద్వారా రాష్ట్ర పొలాల్లోకి తీసుకురావడానికి, కోట్ల ఎకరాల సాగునీటి అవసరాలను తీర్చడానికి కేసీఆర్ ఎంతో త్యాగం చేసి నిర్మించిన ప్రాజెక్టు” అని తెలిపారు.
కమిషన్ పేరు చెప్పి నోటీసులు జారీ చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని మండిపడ్డారు. “ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్” అని కవిత విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ వంటి ప్రజానాయకుడిని ఈ తరహా కుట్రల ద్వారా నిలదీయడం దారుణమని, వేసిన కమిషన్లు కాలక్రమంలో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తాయన్నారు.