Karnataka Congress | సిద్ధరామయ్య, డీకే శివకుమార్కు ఢిల్లీ పిలుపు
Karnataka Congress | సిద్ధరామయ్య, డీకే శివకుమార్కు ఢిల్లీ పిలుపు
Karnataka Congress | కాంగ్రెస్ అధిష్టానం కీలక సమావేశంపై ఉత్కంఠ
డీకే శివకుమార్కు సీఎం పదవి అవకాశాలపై చర్చ
ప్లాన్ బీ, ప్లాన్ సీతో కాంగ్రెస్ వ్యూహాలు
మల్లికార్జున్ ఖర్గే పేరు కూడా పరిశీలనలోకి?
Karnataka Congress | న్యూఢిల్లీ బ్యూరో : కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పుకు సంబంధించిన చర్చలు మరోసారి ముమ్మరమయ్యాయి. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్లను అధిష్టానం ఢిల్లీకి పిలిపించింది. మంగళవారం ఉదయం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో ఒక కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు.
గత ఏడాది నాయకత్వ మార్పుపై గుసగుసలు వినిపించినప్పటికీ, అప్పట్లో మాత్రం ఆ విషయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు ఈ ఢిల్లీ సమావేశం అత్యంత కీలకమైనదిగా మారుతోంది. ఇది ఒక సాధారణ సమావేశం కాదని హస్తిన వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశంలో కర్ణాటక నాయకత్వ మార్పు, 2028 అసెంబ్లీ ఎన్నికల సన్నాహాలపై చర్చ జరగనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
2028 నాటికి అన్నీ సక్రమంగా ఉండేలా చూసుకోవడానికి, ప్రభుత్వంలో ఒక నూతన ఆరంభం అవసరమని అధిష్టానం భావిస్తోంది. ఇందులో రెండు మూడు ఫార్ములాలను తెరమీదకు తెచ్చేలా పరిస్థితులు ఉన్నాయి. మొదటిది ఏమిటంటే, ప్రభుత్వాన్ని యథాతథంగా ఉంచి, కేవలం మంత్రులను మార్చడంగా భావిస్తున్నారు.
అతి తక్కువ ఇబ్బందులు ఉండే విధానం కేవలం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ. సరిగ్గా పనిచేయని మంత్రులను తొలగించాలి. కుల సమీకరణాలను మెరుగుపరచడానికి, అహిందకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలి. శివకుమార్ అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అంటే, ఈ మార్పు అధిష్టానం నిర్ణయం మీద కాకుండా, ఇద్దరు నాయకుల అంగీకారంతోనే జరుగుతుందనేది ఒక నిర్ణయంగా తెలుస్తోంది.
ప్లాన్ బీ లేదా ప్లాన్ సీ..
ఎన్నాళ్ల నుంచో డీకే శివకుమార్ను ఊరిస్తూ వస్తున్న సీఎం పదవికి అధిష్టానం సైతం క్లియరెన్స్ ఇచ్చేలా పరిస్థితులు ఉన్నాయి. రెండో ప్లాన్ కింద శివకుమార్ ముఖ్యమంత్రి కావడం అనేది కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే ఇప్పుడు అత్యంత చర్చనీయాంశంగా మారింది. శివకుమార్ను ముఖ్యమంత్రిని చేయాలి, సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపాలి. కొత్త మంత్రివర్గంలో శివకుమార్ అనుచరులకు స్థానాలు కల్పించాలి అనేది కాంగ్రెస్ మరో ఆలోచనగా తెలుస్తోంది.
పార్టీ కోసం కష్టపడి పనిచేసేవారికి ప్రతిఫలం లభిస్తుందనే స్పష్టమైన రాజకీయ సందేశాన్ని ఇది పంపుతుంది. 2028కి ముందే పార్టీలోని రెండు వర్గాలను ఏకం చేసే ప్రయత్నం కింద దీన్ని అమలు చేసే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు కుదరని పక్షంలో ప్లాన్ సీ కింద మల్లికార్జున్ ఖర్గేను సీఎం పదవిలో కూర్చోబెట్టాలని అనుకుంటున్నట్లుగా సమాచారం.
ఇది జరగడానికి అతి తక్కువ అవకాశం ఉన్నా, ఇద్దరు నాయకులు ఒక ఒప్పందానికి రాలేకపోతే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కర్ణాటక ముఖ్యమంత్రిగా నియమించాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఖర్గే స్వయంగా కర్ణాటక వాసి. ఆయనకు చాలా కాలంగా ముఖ్యమంత్రి కావాలనే కోరిక సైతం ఉంది. కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది. ఒకవేళ ఖర్గే కర్ణాటక వెళితే, ఢిల్లీలోని కాంగ్రెస్ వ్యవస్థ మొత్తం కుదిపేసినట్లుగా మారుతుంది. రాహుల్ గాంధీ కొత్త జాతీయ నాయకత్వ బృందాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అందువల్ల ఈ ప్లాన్ సీ జరిగే అవకాశం చాలా తక్కువగా ఉన్నట్లుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
