Hormuz | మ‌ళ్లీ వార్ !

Hormuz | మ‌ళ్లీ వార్ !

Hormuz | ఇరాన్ పై వ‌రుస దాడులు
హ‌ర్మూజ్ జ‌ల‌సంధి వ‌ద్ద మైనింగ్ బోట్లు బ్లాస్ట్
టెహ్రాన్ స‌మీపంలోని మిసైల్ ఫైరింగ్ కేంద్రాలు ధ్వంసం
దాడులు ఆత్మ‌ర‌క్ష‌ణ కోస‌మేనంటూ క‌వ‌రింగ్

Hormuz | న్యూ ఢిల్లీ, ఆంద్ర‌ప్ర‌భ : ప‌శ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికేందుకు దోహాలో కీలక చర్చలు సాగుతున్న వేళ, అమెరికా చేపట్టిన తాజా సైనిక చర్యలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మార్చేలా కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణకు సంబంధించిన చర్చలు గోప్యంగా కొనసాగుతుండగానే, ఇరాన్‌ దక్షిణ ప్రాంతం, హ‌ర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా దళాలు దాడులు చేసింది.
అమెరికా సెంట్రల్ కమాండ్‌ సమాచారం ప్రకారం, ఈ చర్యలు పూర్తిగా “ఆత్మరక్షణ” కోసమే చేపట్టినవని అధికారులు చెబుతున్నారు. హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా యుద్ధ నౌకలు, సైనిక బలగాలకు ముప్పు ఏర్పడిందని భావించిన నేపథ్యంలో కొన్ని ఇరానీ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, నౌకలు, వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా మారినట్లు సమాచారం.

నావికా మైన్లు అమ‌రుస్తున్నార‌ని..?
అమెరికా అధికారుల ప్రకారం, ఇరాన్‌కు చెందిన కొన్ని పడవలు హ‌ర్మూజ్ జలసంధిలో నావికా మైన్లు అమర్చేందుకు ప్రయత్నిస్తున్నాయని గుర్తించిన తర్వాతే ఈ చర్యలు చేపట్టారు. ప్రపంచ చమురు సరఫరాలో కీలక పాత్ర పోషించే ఈ సముద్ర మార్గం భద్రతపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు ఉన్నాయి. ప్రతి రోజు లక్షల బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారా రవాణా అవుతుండటంతో ఇక్కడ ఉద్రిక్తతలు పెరగడం అంతర్జాతీయ మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ ఇరాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో అమెరికా వైమానిక దళాలు దాడులు నిర్వహించగా, హ‌ర్మూజ్ సమీపంలో ఉన్న ఇరానీ పడవలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు విదేశీ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అదేవిధంగా అమెరికా యుద్ధ విమానాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్న ఒక క్షిపణి రక్షణ స్థావరంపై కూడా దాడి జరిగినట్లు సమాచారం.

శాంతి చ‌ర్చ‌ల‌పై అనిశ్చితి
ఈ పరిణామాలు జరుగుతున్న సమయంలో దోహాలో అమెరికా, ఇరాన్ ప్రతినిధుల మధ్య ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్చలు కొనసాగుతున్నాయి. ఖతార్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ఈ చర్చల్లో కాల్పుల విరమణ, సముద్ర భద్రత, అణు కార్యక్రమం వంటి అంశాలు ప్రధానంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తాజా దాడులతో శాంతి చర్చల భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హ‌ర్మూజ్ ప్రాంతంలో ఎలాంటి “ప్రేరేపణాత్మక చర్యలు” జరిగినా వెంటనే కఠినంగా స్పందించాలని సైన్యానికి అధికారాలు ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ప్రమాదకర దశకు చేరుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన చమురు రవాణా మార్గాల్లో హ‌ర్మూజ్ జలసంధి ఒకటి. ఇక్కడ సైనిక ఘర్షణలు పెరిగితే అంతర్జాతీయ చమురు ధరలు మరింత పెరగడంతో పాటు ప్రపంచ వ్యాపార రంగంపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

CLICK HERE TO READ Petrol Price Hike | నాలుగోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

CLICK HERE TO RAED MORE

Leave a Reply