మాదకద్రవ్యాలకు నో చెప్పండి

మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ: ఎల్కతుర్తి మండలం బావుపేట గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో వరంగల్‌కు చెందిన సుమతి రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ (ఎస్‌ఆర్‌ఐటిడబ్ల్యూ) ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు మాదకద్రవ్యాల దుర్వినియోగం, వాటి వల్ల కలిగే ఆరోగ్యపరమైన దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక, సామాజిక, చట్టపరమైన దుష్పరిణామాలను వివరించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరచుకోవాలని, తోటి వారి ఒత్తిడికి లొంగకుండా సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ఐటిడబ్ల్యూ ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. కె. మహేందర్ శర్మ పాల్గొన్నారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, రవుల శశికుమార్ రెడ్డి సమన్వయంతో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. బావుపేట సర్పంచ్ బత్తిని రవీందర్ గౌడ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మనోహర్ నాయక్ విద్యార్థులను ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. ఐ. రాజశ్రీ రెడ్డి ఎన్‌ఎస్‌ఎస్ బృందాన్ని అభినందించారు. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సూచించారు. విద్యార్థుల్లో సామాజిక బాధ్యతను పెంపొందిస్తూ, మాదకద్రవ్యాల రహిత సమాజ నిర్మాణానికి ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

కార్యక్రమం ముగింపులో విద్యార్థులు “మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటాం. మా కుటుంబ సభ్యులు, స్నేహితుల్లోనూ అవగాహన కల్పిస్తాం” అంటూ ప్రతిజ్ఞ చేశారు.