ఫిన్లాండ్ వెళ్లి వచ్చిన ఉపాధ్యాయులకు కలెక్టర్ సన్మానం..

జన్నారం, ఆంధ్రప్రభ : విదేశీ విద్యా విధానాల అధ్యయనం కోసం ఫిన్లాండ్ వెళ్లి వచ్చిన జన్నారం మండలానికి చెందిన ఇద్దరు ఉపాధ్యాయులను మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఘనంగా సన్మానించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కిష్టాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ దాముక కమలాకర్, పొనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని అక్కపల్లిగూడ మండల పరిషత్ ఆంగ్ల మాధ్యమ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాజాల శ్రీనివాస్లకు శాలువాలు కప్పి అభినందించారు.

ఫిన్లాండ్‌లోని విద్యా విధానాలపై అధ్యయనం చేసి వచ్చిన ఈ ఉపాధ్యాయులు తమ అనుభవాలను ఇతర ఉపాధ్యాయులతో పంచుకొని ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) చంద్రయ్య, ఇన్‌చార్జి డీఈఓ, మండల విద్యాధికారి బి. రాజేందర్, స్థానిక బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎన్. విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.