CBN 1995 | హత్యలు చేయించేది అయనే.. అసత్యాలు వల్లె వేసేది అయనే

CBN 1995 | హత్యలు చేయించేది అయనే.. అసత్యాలు వల్లె వేసేది అయనే
తల్లి, చెల్లిని చూడనివారు ప్రజలకు ఏం మేలు చేస్తారు?
అభివృద్ధిని చూసి ఓర్వేలేకపోతున్న గొడ్డలి పార్టీ
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్లతోనూ డ్రామాలు
యాదమర్రి ప్రజావేదిక సభలో జగన్ పై చంద్రబాబు ఫైర్
CBN 1995 | చిత్తూరు, ఆంధ్రప్రభ : మాజీ సీఎం జగన్ నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రాబాబు అన్నారు. మాజీ మంత్రి వివేకా హత్యకేసులో తనపై దుష్ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. బాబాయ్ హత్యలో తనపై నారాసుర రక్త చరిత్ర అని ప్రచారం చేశారని దుయ్యబట్టారు. డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యంను చంపిన ఎమ్మెల్సీ అనంతబాబుకు.. జగన్ సన్మానం చేశారని సెటైర్లు గుప్పించారు. తల్లి, చెల్లిని చూడనివారు ప్రజలకు మంచి చేస్తారా..? అని ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా యాదమర్రిలో శనివారం నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, అభివృద్ధిని చూసి గొడ్డలి పార్టీ ఓర్వలేకపోతోందని విమర్శించారు.

హత్యలు చేయించిన వ్యక్తే నంగనాచిలా మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. అమరావతిపై గొడ్డలి వేటు వేసిన వ్యక్తి జగన్రెడ్డి అని విమర్శించారు. అసత్య ప్రచారాలతో జగన్ అండ్ కో లబ్ధి పొందాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కోడి కత్తి, గులకరాయి నాటకాలు గుర్తున్నాయి కదా? అని ప్రశ్నించారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రోజుకో నాటకమాడుతున్నారని విమర్శించారు. జగన్ అధికార దాహానికి తల్లి, చెల్లి అతీతం కాదని అన్నారు.హిందూ ధర్మం, దేవాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
CBN 1995 | పాస్టర్లనూ రెచ్చగొడుతున్నారు..
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్లతో డ్రామాలు చేయిస్తున్నారని ముఖ్యమంత్రి ధ్వజమెత్తారు. రప్పా.. రప్పా అని జగన్ కటౌట్లకు జంతువుల రక్తం చల్లుతున్నారని విమర్శించారు. తన దగ్గర తోకజాడిస్తే కట్ చేస్తా.. ఇక్కడుంది 1995 నాటి సీబీఎన్ అని ప్రస్తావించారు. జగన్.. ముందు నీ ఇంట్లో సమస్యలు చూసుకోవాలని హితవు పలికారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. గొడ్డలి పార్టీ బుద్ధి మారట్లేదని ఆగ్రహించారు. ప్రజాస్వామ్యంలో గొడ్డలి పార్టీకి చోటు లేదని చెప్పుకొచ్చారు. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరమని.. గొడ్డలి పార్టీ నెవర్ అగైన్ అని పేర్కొన్నారు.
