జల్లి ఘటనలో పలువురిపై కేసులు

చెన్నారావుపేట, ఆంధ్రప్రభ : మండలంలోని జల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ జక్క అశోక్, గ్రామ సర్పంచ్ యాట సుధాకర్ తదితరులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రాజేష్ రెడ్డి తెలిపారు.

ఎస్‌ఐ వివరాల ప్రకారం, జల్లి గ్రామానికి చెందిన దొంతరబోయిన కొమ్మాలు, ఆయన కుమారులను ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్న సమయంలో సర్పంచ్, ఉప సర్పంచ్‌తో పాటు పలువురు ఏసీపీ వాహనాన్ని అడ్డుకున్నారు.

అలాగే, జైలుకు తీసుకెళ్తున్న ఎస్కార్ట్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించడంతో పాటు ఎలాంటి అనుమతి లేకుండా పోలీస్ స్టేషన్ ముందు నిరసనకు దిగినట్లు తెలిపారు. ఈ ఘటన మాజీ ఎంపీపీ ప్రోద్బలంతో జరిగిందని ఏఎస్ఐ లక్ష్మణమూర్తి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు జక్క అశోక్, యాట సుధాకర్, బాబు, కుమారస్వామి, క్రాంతి, శరత్, మల్లేశం, సుజాతలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు.