AP | పట్టపగలు మహిళ దారుణహత్య…
వృద్ధుడిపైనా దాడి..
పెదకూరపాడులో కలకలం..
ఆస్తి తగాదాలపై అనుమానం..
AP | (పెదకూరపాడు/అమరావతి , ఆంధ్రప్రభ) : పెదకూరపాడులో ఓ మహిళను పట్టపగలు జనం చూస్తుండగానే ఓ అగంతకుడు చంపేశాడు. కేవలం ఆస్తుల కోసమే ఈ హత్య జరిగినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, పెదకూరపాడు మండలం దామచర్ల పాలెం గ్రామస్తుడు అవ్వారి బాల రంగయ్య (75) అరుణ (45) భార్యాభర్తలు.
వీరిద్దరిది రెండవ పెళ్లి కాగా.. కుటుంబ సభ్యులకు దూరంగా కాపురం చేస్తున్నారు.బాల రంగయ్య స్థితి పరుడు. ఇక బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆ ప్రాంతం ఒక్కసారిగా గందరగోళంగా మారింది. గుర్తుతెలియని అగంతకుడు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. వీరి ఇంట్లోకి వెళ్లి ఆధార్ కార్డు తీసుకురావాలని అడిగాడు. ఆధార్ కార్డు తీసుకుని యజమాని బాల గురవయ్య వచ్చేలోపు అరుణ గొంతును ఆగంతకుడు కోశాడు.

బయటికి వచ్చిన బాల గురవయ్య పై ఇనుప వస్తువుతో తలపై కొట్టాడు. తీవ్ర గాయంతో అరుస్తూ అరుణ ఇంటి బయటకి పరిగెత్తుకుని వచ్చింది. అగంతకుడు ఆమెను వదిలిపెట్టకుండా మరల గొంతుపై కత్తితో కోశాడు. అంతే అరుణ కుప్పకూలిపోయింది. స్థానికులు బాల గురవయ్యను త్వరితగతిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెదకూరపాడు పోలీసులు ఆగమేఘాలపై నేర స్థలానికి చేరుకున్నారు. పెదకూరపాడు డీఎస్పీ సైతం నేర స్థలికి చేరుకున్నారు. ప్రస్తుతం హంతకుడి కోసం పోలీసులు వేట ప్రారంభించారు.

