తల్లిపాలే శిశువుకు తొలి టీకా: కలెక్టర్ సత్యశారద

వరంగల్, ఆంధ్రప్రభ: ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా గురువారం వరంగల్ సి.కె.ఎం. ఆసుపత్రిలో తల్లిపాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ముఖ్య అతిథిగా హాజరై బాలింతలు, గర్భిణీలు, వారి కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిశువు జన్మించిన తొలి గంటలోపే వచ్చే ముర్రుపాలను తప్పనిసరిగా పట్టించాలని సూచించారు. ముర్రుపాలు శిశువుకు సహజ రోగనిరోధక శక్తిని పెంపొందించడంతో పాటు అవసరమైన పోషకాలను అందిస్తాయని తెలిపారు.

తల్లిపాలు తాగిన పిల్లలకు డయేరియా, న్యుమోనియా, కామెర్లు వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుందని, మెదడు ఎదుగుదల మెరుగుపడటంతో పాటు తల్లి–బిడ్డల మధ్య అనుబంధం బలపడుతుందని పేర్కొన్నారు.

అలాగే తల్లులకు ప్రసవానంతర రక్తస్రావం తగ్గడం, గర్భాశయం త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడం, స్థూలకాయం తగ్గడం, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, టైప్–2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గడం వంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.

శిశువుకు తొలి ఆరు నెలల పాటు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం తల్లిపాలతో పాటు వయస్సుకు తగిన ఆహారాన్ని అందించాలని సూచించారు. బాలింతలు తగినంత నీరు తాగుతూ, సమతుల్య పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లిపాల ఉత్పత్తి మెరుగుపడుతుందని చెప్పారు.

అవసరానికి మించి తల్లిపాలు ఉత్పత్తి అయ్యే తల్లులు మిల్క్ బ్యాంక్‌కు పాలను దానం చేయాలని, ఆ పాలను అవసరమైన శిశువులకు అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులకు కంగారూ మదర్ కేర్ విధానాన్ని పాటించడం వల్ల మెరుగైన ఎదుగుదల సాధ్యమవుతుందని వివరించారు.

గర్భధారణ సమయంలోనే సాధారణ ప్రసవానికి మానసికంగా, శారీరకంగా సిద్ధం కావాలని, అవసరం లేనప్పుడు శస్త్రచికిత్స ప్రసవాలను ప్రోత్సహించకూడదని కలెక్టర్ సూచించారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు తల్లిపాల ప్రాముఖ్యత, కంగారూ మదర్ కేర్ విధానంపై రోల్ ప్లే ప్రదర్శించి అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రాజా రెడ్డి, సి.కె.ఎం. ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. లక్ష్మిదేవి, జిల్లా సంక్షేమ అధికారి రాజమణి, ప్రోగ్రామ్ అధికారులు డా. ఐ. ప్రకాష్, డా. రాజమౌళి, డా. సజిదా, డా. ఇక్తాదార్ అహమ్మద్, డా. అరుణ్ జోషి, ఆర్‌ఎంఓ డా. సృజన్ బాబు, యు.ఎఫ్.డబ్ల్యూ.సి. వైద్య అధికారి డా. దిలీప్ కుమార్, అబ్దుల్లా బాబా, ఎస్. వెంకటేశ్వర్లు, నర్సింగ్ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.