BHADRACHALAM | ఏడు కిలోల చక్కెర పొంగలి రూ.400

BHADRACHALAM | ఏడు కిలోల చక్కెర పొంగలి రూ.400
BHADRACHALAM | భద్రాచలంలో భలే చౌక బేరం
అక్రమాలను కప్పిపుచ్చేందుకే అధికారుల నిర్ణయం
BHADRACHALAM | భద్రాచలం, ఆంధ్రప్రభ : భద్రాచలం శ్రీసీతారామాలయం (BHADRACHALAM SRI SEETHARAMA ALAYAM) రూటే సపరేటు.. ఎక్కడైనా ఆలయాల్లో తయారైన ప్రసాదం ప్యాకెట్ల లెక్కన ఎన్ని కావాలంటే అన్ని భక్తులకు అందిస్తారు. కానీ భద్రాచలం శ్రీసీతారామాలయంలో మాత్రం భక్తులు ముందుగా ఆర్డర్ ఇస్తే తయారీ చేసి సరఫరా చేస్తారు. అయితే దీన్ని వెనుక అక్రమాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. నిన్నవెలుగు చూసిన అక్రమాన్ని కప్పి పుచ్చేందుకు ఆలయ అధికారులు కొత్తగా దిట్టం అని తెరపైకి తీసుకు వచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏడు కిలోల చక్కెర పొంగలి రూ.400కే భక్తులకు సరఫరా చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.
BHADRACHALAM | నిన్న వెలుగు చూసిన అక్రమాలు
భద్రాచలం శ్రీసీతారామాలయంలో నిన్న (మంగళవారం) ఓ వ్యక్తి రెండు వేల రూపాయలు చక్కెర పొంగలి (CHAKKERA PONGALI) కోసం ముందస్తు డబ్బులు చెల్లించారు. ఆ వ్యక్తి ప్రసాదం పట్టుకుని బయటకు వెళుతుండగా, దేవాలయ ఎస్పీఎఫ్ బృందం తనిఖీలు నిర్వహించారు. ఆ వ్యక్తి ఐదు కిలోల చక్కెర పొంగలికి రుసుం చెల్లించగా అతని వద్ద 42 కిలోల ప్రసాదం లభించడంతో సెక్యూరిటీ సిబ్బంది అవాక్కయ్యారు. ఈ క్రమంలో ప్రసాదం అందించిన సిబ్బంది ఆ వ్యక్తిని పిలిచి తిరిగి పంపగా, 36 కిలోలు బరువు తూగింది. రూ. 2000 రూపాయలకు 36 కిలోల చక్కెర పొంగలి అంటూ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇది చిలికి చిలికి గాలివానగా మారి ఆలయ అధికారికి చేరింది. దీంతో దిట్టం వెలుగులోకి తీసుకు వచ్చారు.
BHADRACHALAM | దిట్టం ప్రకారం…
దేవస్థానం విడుదలు చేసిన ప్రకటన ప్రకారం, దిట్టాన్ని అనుసరించి ఒక కిలో ప్రసాదం తయారీకి ఒక కేజీ బియ్యం, కిలోన్నురా చక్కెర, 250 గ్రాముల పెసర పప్పు, 350గ్రాముల నెయ్యి, కిస్మిస్ 50 గ్రాములు, జీడిపప్పు 50గ్రాములు, రెండు గ్రాముల యాలకులు వేస్తారని తెలిపారు. ఈ క్రమంలో 16 కిలోలు పైగా వివిధ సామాగ్రిని ఐదు కిలోల ప్రసాదం చెల్లింపులకు వాడటం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో నీటి శాతంతో కలిపి ఐదు కిలోలకు పైగా ప్రసాదం లభిస్తుందని ప్రకటించారు. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో మంచి నాణ్యత (Quality) కలిగిన కిలో బియ్యం రూ.50 లు, ఒకటిన్నర కిలోల చక్కర 80రూపాయలు, పెసరపప్పు పాతిక రూపాయలు, 350 గ్రాముల నెయ్యి సుమారు 250 రూపాయలు, 50 గ్రాములు కిస్మిస్ 34 రూపాయలు, జీడిపప్పు 50రూపాయలు, రెండు గ్రాములు ఇలాచి కనీసం 10 రూపాయలు ఉంది. ఈ మొత్తం వెరసి 400 రూపాయలు పైగా ఉంది. ఏ విధంగా చూసినా రూ.400కు ఏడు కిలోల ప్రసాదం ఇచ్చే అవకాశం లేదు. ఒక వేళ రూ.400 లకు ఏడు కిలోలు ఇస్తమంటే నాణ్యతపై అనుమానాలు వ్యక్తమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.
BHADRACHALAM | అక్రమాలపై మండిపడుతున్న భక్తులు…
భద్రాచలంలో ఐదు కిలోల ప్రసాదం తయారీకి నాలుగు వందల రూపాయలు ఖర్చు అవుతుంది. నిన్న జరిగిన అక్రమాన్ని కప్పి పుచ్చేందుకు రూ.400లకు ఏడు కిలోల అంటూ రెండు వేలు చెల్లిస్తే 35 కిలోలు ఇచ్చినట్లు చూపించడానికి దిట్టం ను అధికారులు తెరపైకి తీసుకొచ్చారు. దేవస్థానం (temple) వారు చెప్పిన ప్రకారం దిట్టం అనుగుణంగా ప్రసాదం అందించాల్సి వస్తే పది రూపాయలు చెల్లించిన తమకు ఇంకా ఎక్కువ ప్రసాదం రావాలి కదా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు అవినీతిని కప్పిపుచటానికి కొందరు సిబ్బంది దిట్టం అంటూ కొత్త విషయాన్ని వెలుగులోకి తీసుకువచ్చారని విమర్శిస్తున్నారు. దీపాల వెలిగించే సంఘటనలో గ్రీన్ భద్రాద్రి వారి సూచన అని చెప్పడం, నిన్నటి ప్రసాదం విషయంలో దిట్టం అని ఉదహరించటం ఆశ్చర్యం కలిగిస్తుందని భక్తులు అన్నారు. ఈ అవనీతి అక్రమాలపై ఏసీబీ, విజిలెన్స్ సంస్థలతో దర్యాప్తు చేసి భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను భక్తులు కోరుతున్నారు.
