హైదరాబాద్ – నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండన్న రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి వ్యాఖ్యలకు బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతకానితనం వల్ల వచ్చిన కరవు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరవు అంటూ చురకలు అంటించారు.
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును ఏడాదికాలంగా ఎండబెట్టి, రిజర్వాయర్లు పండబెట్టడం వల్లే రాష్ట్రంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయన్నది వాస్తవం అన్నారు.
పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో చెరువులు, కుంటలు నిండుకుండలను తలపించేలా నిర్వహణ చేయడం వల్లే తెలంగాణ వ్యాప్తంగా ఏనాడూ భూగర్భజలాలు పడిపోలేదని వివరించారు. కానీ కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల ఏడాది కాలంలోనే భూగర్భజలాలు పాతాళానికి పడిపోయి సమైక్యరాష్ట్రం నాటి దుస్థితి నెలకొందని గుర్తు చేశారు.
రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ గా ఉంటూ ఉన్న వాస్తవాలు చెప్పాల్సింది పోయి.. వాటిని కప్పిపుచ్చి ఫిబ్రవరిలోనే ఎండలు ముదరడం వల్ల భూగర్భజలాలు పడిపోయాయనడం దారుణం అంటూ కొదండరెడ్డి పై ఫైర్ అయ్యారు కేటీఆర్.