వాణిజ్య పన్నుల శాఖ సుస్థిర ప్రగతి
వాణిజ్య పన్నుల శాఖ సుస్థిర ప్రగతి
- సీఎస్కు సంఘాల సమగ్ర నివేదిక
- అహ్మద్బాబు పనితీరుకు ఉద్యోగుల సంపూర్ణ మద్దతు
ఆంధ్రప్రభ, విజయవాడ: వాణిజ్య పన్నుల శాఖలో అహ్మద్ బాబు పనితీరుకు ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలోని వివిధ సంఘాల ప్రతినిధులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి శాఖలో నెలకొన్న పరిస్థితులతో పాటు పరిపాలన, అభివృద్ధి అంశాలను సమగ్రంగా వివరించారు. అహ్మద్బాబు పనితీరు పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు. వాణిజ్య పన్నుల శాఖలో అహ్మద్ బాబు బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని కేడర్లలో పదోన్నతులు కల్పించడం జరిగిందని.. ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్ సెంటర్ ద్వారా పన్నుల వసూళ్లను గణనీయంగా పెంచి రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో శాఖను ముందంజలో నిలిపినట్లు సీఎస్కు తెలియజేశారు.
శాఖలో పరిపాలన పారదర్శకంగా, సవ్యంగా కొనసాగుతోందని.. ఒక సంఘం తప్ప మిగతా అన్ని సంఘాలు ఏకగ్రీవంగా ప్రభుత్వానికి, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ కమిషనర్ కు ఇదే విషయాన్ని వివరించినట్లు తెలిపారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమంది ఉద్యోగులు, అధికారులను ఇబ్బందులకు గురిచేస్తూ శాఖ ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నించడాన్ని అన్ని సంఘాలు ముక్తకంఠంతో ఖండించాయి. తల్లి లాంటి వాణిజ్య పన్నులు శాఖను రోడ్డుమీదకు తీసుకురావడం వంటి చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ సందర్భంగా వాణిజ్య పన్నుల శాఖ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు తోట రాజశేఖర్, ఎస్సీ & ఎస్టీ ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షులు నిర్మల జ్యోతి, జీఎస్టీ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు పురుషోత్తమ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతల కళ్యాణ్ కుమార్, ఆలిండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కన్వీనర్ రాజ్యలక్ష్మి, ఏపీ ఎన్జీజీవో అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్. వేణుగోపాల్ పాల్గొన్నారు.
