ఏసీబీ ఉచ్చులో గాంధీనగర్ ఎస్సై..
- స్టేషన్ బెయిల్ కోసం లంచం డిమాండ్..
హైదరాబాద్, ఆంధ్రప్రభ : లంచం తీసుకుంటూ గాంధీనగర్ పోలీస్ స్టేషన్కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ వి.నర్సింహులు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. మంగళవారం సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు నిర్వహించిన ఉచ్చులో సబ్ ఇన్స్పెక్టర్ వి.నర్సింహులు పట్టుబడ్డారు.
ఒక కేసులో ఫిర్యాదుదారుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి వేధింపులు ఉండవని హామీ ఇచ్చేందుకు ఎస్సై నర్సింహులు రూ.1 లక్ష లంచం డిమాండ్ చేసినట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ మొత్తంలో భాగంగా రూ.50 వేల నగదును స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటన అనంతరం ఎస్సై నర్సింహులను అరెస్టు చేసి, నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపరచి రిమాండ్కు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతోంది.
