కర్నూల్ బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, వారి కుటుంబ సభ్యులపై సినీ నటుడు పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కర్నూలు జిల్లా మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో కర్నూలు కోర్టు బుధవారం ఆయనకు 14రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది.
ఈకేసులో పోసానిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత గుంటూరు జిల్లాలో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసానిని తమకు అప్పగించాలంటూ ఆదోని పోలీసులు జైలు సిబ్బందిని కోరారు. వారు అనుమతి ఇవ్వడంతో పోసానిని మంగళవారం అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల తర్వాత కర్నూలు జిల్లా కోర్టుకు తరలించి న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత పోసానికి న్యాయమూర్తి ఈనెల 18వతేదీ వరకు రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయనను కర్నూలు జిల్లా జైలుకు తరలించారు. కాగా, పోసానిపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 కేసులు నమోదైన సంగతి విధితమే.