ఎంత ధాన్యం వచ్చింది?.. ఎంత గొనుగోలు చేశారు?

ఎంత ధాన్యం వచ్చింది?.. ఎంత గొనుగోలు చేశారు?
రాజన్న సిరిసిల్ల, ఆంధ్రప్రభ : కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అన్ని వసతులు కల్పించాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగర్వాల్(Garima Agarwal) ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాగట్లపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఇంచార్జి కలెక్టర్ ఈ రోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంత వరకు ఎంత ధాన్యం వచ్చింది..? ఎంత కొనుగోలు చేశారో ఆరా తీశారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్, నీటి, విద్యుత్ సరఫరా, వసతి(tent, water and electricity supply accommodation) కల్పించాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా చెత్తాచెదారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సరైన తేమ వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా..?
ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించి బోర్డుపై పేర్లు రాయించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం(quality food) విద్యార్థులకు అందించాలని, విద్యార్థులతో నిత్యం చదివించడం, రాయించాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పేర్కొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన..
ఎల్లారెడ్డిపేట మండలంలోని సింగారంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఇంచార్జి కలెక్టర్ పరిశీలించారు. ఇంటి నిర్మాణం, ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆరా తీశారు. ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
ఇందిరమ్మ ఇళ్లు(Indiramma houses) మంజూరు అయిన లబ్ధిదారులు త్వరితగతిన పనులు పూర్తి చేసుకోవాలని, ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇండ్ల నిర్మాణంపై అధికారులు అవగాహనా కల్పించి, పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. సందర్శనలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, నాయబ్ తహశీల్దార్ మురళి, ఎంపీఓ రాజు తదితరులు పాల్గొన్నారు.
