ఈవీఎం గోడౌన్ సందర్శన

నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
నాగర్ కర్నూల్, ఆంధ్రప్రభ : జిల్లా కేంద్రంలోని నాగర్కర్నూల్ పట్టణంలో ఉన్న ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) గోడౌన్ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం సమగ్రంగా పరిశీలించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా ఆయన క్షేత్రస్థాయి సందర్శన నిర్వహించారు. ఈవీఎం గోడౌన్ వద్ద వేసిన సీల్స్ను, భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, అక్కడ ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు తీరును గమనించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ప్రతి నెలా ఈవీఎం గోడౌన్ను తప్పనిసరిగా తనిఖీ చేస్తున్నామన్నారు. ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఈ తనిఖీలను కచ్చితంగా అమలు చేస్తున్నామని తెలిపారు. తనిఖీ సమయంలో కలెక్టర్ ఈవీఎంల నిల్వ పరిస్థితులు, గోడౌన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరు, సీల్స్ వివరాలు, భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆయన వెంట కలెక్టరేట్ ఎన్నికల విభాగం సిబ్బంది, గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.
