రోడ్డు మీద మృతదేహం

రోడ్డు మీద మృతదేహం
సొంత ఇంట్లోకే రానివ్వని వైనం
కొడుకు, మరవరాలి ఆవేదన
శ్రీకాకుళం, నవంబర్ (ఆంధ్రప్రభ) : మాయమై పోతున్నడమ్మ మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ.. మానవత్వం ఉన్న వాడు.. అన్న ఓ సినీ కవి మాటలు అక్షరసత్యం అవుతున్నాయి. మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి అనడానికి శ్రీకాకుళంలో చోటు చేసుకున్న ఈ ఘటనే ఓ ఉదాహరణ. అనేక మందిని ఉన్నతులుగా తీర్చిదిద్దిన ఓ మహిళ ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి (Principal Ramadevi) (77) మృతి చెందితే ఆమె మృతదేహాన్ని కష్టపడి కట్టుకున్న సొంత ఇంట్లో నుంచి సాగనంపాలని కోరికను తీర్చలేని పరిస్థితి నెలకొంది.
చనిపోయిందని ఆమె మృతదేహాన్ని తీసుకుని ఇంటి దగ్గరకు వస్తే మృతదేహాన్ని లోపలికి రానీకుండా నిర్ధాక్షణంగా తలుపులు మూసి మృతదేహాన్ని రోడ్డు మీదే ఉంచేసింది కోడలు.. అత్యంత రద్దీ గల పెళ్లి మండపం నుంచి వైఎస్ఆర్ విగ్రహానికి వెళ్లే మధ్య మార్గంలో రిలయన్స్ మార్ట్ ఎదురుగా రోడ్డు మీదే మృతదేహాన్ని శవపేటిక (Coffin) లో పెట్టి కొడుకు, మనవరాలు ఆవేదన అంతా ఇంత కాదు.. కొడుకు సురేష్ భార్యాభర్తల మధ్య నెలకొన్న వివాదంతో కోడలి సూటిపోటి మాటలు భరించలేక సురేష్ తల్లిని తీసుకొని మనవరాలను చదివించుకుంటూ పుత్తూరులో ఉంటున్నారు.
అయితే రమాదేవి 77 సంవత్సరాల తర్వాత మృతి చెందింది. ఈ నేపథ్యంలో సొంత ఇంట్లో ఉంచి తన మృతదేహాన్ని అంతిమయాత్ర నిర్వహించాలని ఆమె చివరి కోరిక తీర్చడానికి కొడుకు తన సొంత ఇంటికి తీసుకుని వచ్చాడు. కానీ ఆ కోడలు ఆమె మృతదేహాన్ని లోపలికి రానీకుండా తలుపులు బిగించి లోపల కూర్చున్నది. వారికి ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో కొడుకు సురేష్ (Suresh), మనవరాలు రేష్మ రోడ్డు మీద రోదిస్తున్నారు. తన తల్లి సొంత ఇంటిలోకే ఆమె మృతదేహాన్ని తీసుకోలేకపోతున్నామని కొడుకు మనవరాలు పడుతున్న ఆవేద జనాలని కలచివేస్తుంది. దీనిపైన అధికారులు వెంటనే స్పందించి ఆమె మృతదేహాన్ని సొంత ఇంట్లో ఉంచి అంతిమ యాత్ర చేసే ఏర్పాటు చేయాలని . కొడుకు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన పోలీస్ సిబ్బంది ఆమె దహన క్రియలకు ఏర్పాట్లు చేపట్టారు.
