మద్యం తాగి వాహనాలు నడిపితే చర్యలు
గజ్వేల్, ఆంధ్రప్రభ : మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గజ్వేల్ ఏసీపీ కోణం నర్సింహులు (ACPKonam Narsimhulu) తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ… డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారికి పది వేల రూపాయల జరిమానా గానీ, ఆరు నెలలు జైలు శిక్ష గానీ ఉంటుందన్నారు.
ఆరు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) సస్పెండ్ చేయడంతో పాటు, రెండోసారి వాహనం నడుపుతూ పట్టుపడితే 15 వేల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపవద్దన్నారు.
తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అలాగే సైలెన్సర్ మార్చి వాహనాలు నడపవద్దని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్, రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడిపి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలన్నారు. వాహనాలు నడిపేటప్పుడు వ్యక్తిగత భద్రత నియమాలు తప్పకుండా పాటించాలన్నారు. లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.

