- అక్టోబర్ 27 నుంచి కొనుగోలు ప్రారంభం
- రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
విజయవాడ (ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : 2025–26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్లో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత ప్రభుత్వం చేసిన రూ.1,674 కోట్ల బకాయిలను తీర్చడంలోనూ, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మిల్లర్లకు చెల్లించవలసిన రూ.763 కోట్లు చెల్లించడం ద్వారా కూటమి ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని అన్నారు.
గత ఏడాది 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు పూర్తయిందని, ఈ ఏడాది 2025-26 ఖరీఫ్ సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
బ్యాంక్ గ్యారంటీలు 1:2 నిష్పత్తిలో ఏర్పాటు చేస్తామని, ఇందుకుగాను 35 బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవచ్చని తెలిపారు. కొన్ని జిల్లాలలో రైస్ మిల్లుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రియల్ టైం గవర్నెన్స్ చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు.
సంస్కరణలు..
సంస్కరణలలో భాగంగా వాట్సాప్ ద్వారా రిజిస్ట్రేషన్ సౌకర్యం ఉందని, ‘హాయ్’ అని పంపగానే కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని మంత్రి వివరించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు గుర్తు చేశారు.
పీడీఎస్ (ప్రజా పంపిణీ వ్యవస్థ) బియ్యం స్మగ్లింగ్ను అరికట్టడంలో రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి తోడుగా నిలవాలని, “రైతు కోసం కలిసి పనిచేద్దాం, వ్యవస్థను గౌరవిద్దాం” అని ఆయన అన్నారు.
గత సంవత్సరం అనుభవంతో, తేమ శాతం కొలిచే యంత్రాలు, రవాణా సదుపాయాలు, నాణ్యమైన గన్నీ బ్యాగులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని మిల్లర్లకు సూచించారు. సమస్యల పరిష్కారానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని, పనిచేసే విధానం పారదర్శకంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ నెల 27 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సీజన్లో 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 పీపీసీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మొత్తం 10,700 మంది సిబ్బందితో ధాన్యం సేకరణకు సిద్ధమవుతున్నట్టు మంత్రి తెలిపారు.
పౌర సరఫరాల శాఖ కమిషనర్ సౌరభ్ గౌర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ధాన్యం సేకరణ విధానాన్ని వివరించారు. సివిల్ సప్లై కార్పొరేషన్ వీసీ, ఎండీ ఢిల్లీ రావు మాట్లాడుతూ, గత ఏడాది ధాన్యం కొనుగోలు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొచ్చిందన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వరరావు, కార్యదర్శి వల్లూరి సూరి ప్రకాష్ రావు, కోశాధికారి రంగయ్య నాయుడు, 26 జిల్లాల రైస్ మిల్లర్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

