Hanumakonda | అమానవీయ ఘటన.. మహిళను వివస్త్రను చేసి చిత్రహింసలు

(ఉమ్మడి వరంగల్ ఆంధ్రప్రభ ప్రతినిధి) : సభ్య సమాజం తలదించుకునే సంఘటన హనుమకొండ (Hanumakonda) జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.. ఓ వివాహిత మరో వ్యక్తితో అక్రమ సంబంధం కలిగి ఉందనే ఆరోపణతో ఆ యువతిని చిత్రహింసలకు గురి చేశారు. మానవత్వాన్ని మరిచిపోయారు. గ్రామస్తుల సమక్షంలో ఆ మహిళను వివస్త్రను చేశారు.. మంచానికి కట్టేశారు.. ఆ తర్వాత అతి పాశవికంగాఆమెను హింసించారు. తాను తప్పు చేశానని… క్షమించి వదిలేయమని.. ఎంత ప్రాదేయపడిన కనికరించలేదు.. రక్త స్రావం జరుగుతున్న దయ చూపలేదు… చిత్రహింసలకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందారు.

ఈ అమానవీయ సంఘటన హనుమకొండ జిల్లాలోని ధర్మసాగర్ (Dharmasagar) మండలంలో చోటుచేసుకుంది.. ధర్మసాగర్ మండలం తాటికాయల (Thatikayala) గ్రామానికి చెందిన ఓ యువతి కి దశాబ్దం క్రితం ములుగు జిల్లాలోని వెంకటాపురం మండలం బోల్లోని పల్లె గ్రామానికి చెందిన చిక్కుడు రాజుతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ముగ్గురు పిల్లలున్నారు. రాజు తనకు సమీప బంధువైన మరో వివాహిత తో, వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఆమెతో కలిసి పది రోజుల క్రితం గ్రామం విడిచి వెళ్ళాడు. ఈ వ్యవహారం తెలుసుకున్న రాజు భార్య తనకు జరిగిన అన్యాయాన్ని తల్లిదండ్రులకు వివరించేందుకు స్వగ్రామమైన తాటికాయలకు చేరుకుంది. పలువురు పెద్ద మనుషులు తమ కుటుంబ సభ్యులకు జరుగుతున్న వ్యవహారాన్ని వివరించింది .ఆమె చెప్పిన విషయాలపై ఆగ్రహం చెందిన ఆమె తరపు బంధువులు ఐదు రోజుల క్రితం రాజు , అతనితో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువతిని గ్రామానికి తీసుకువచ్చారు. గ్రామస్తులు ముందు పెట్టి పంచాయతీ చేశారు. మొదట వారిద్దరికీ అర గుండు చేసి అవమానపరిచారు.

అంతటితో ఆగక మానవత్వాన్ని మరిచి ఆటవిక చర్యకు పాల్పడ్డారు. ఆ యువతిని అందరి ముందే వివస్త్రను చేశారు. మంచానికి కట్టేశారు. ఈమెను చిత్రహింసలకు గురిచేశారు. ఐదు రోజుల క్రితం ఈ సంఘటన జరగగా అవమానభారంతో ఆ యువతి, రాజు గ్రామాన్ని విడిచి వెళ్లారు. కొంతమంది పెద్ద మనుషులు, తన భార్య తరపు బంధువులు జరిపిన దాడిలో రాజు కూడా గాయపడినట్లుగా సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ధర్మసాగర్ పోలీసులు (police) సుమోటోగా స్వీకరించి దర్యాప్తు ప్రారంభించారు. ఆ మహిళపై చిత్రహింసలకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం. కాగా ఈ సంఘటనపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. చట్టాన్ని ఎవరు చేతిలో తీసుకున్న ఉపేక్షించేది లేదని హెచ్చరించింది.

Leave a Reply