చండీగర్ – భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. దాయాది దేశానికి సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్న హర్యానాకు చెందిన ఓ కళాశాల విద్యార్థిని అధికారులు తాజాగా అరెస్ట్ చేశారు. సదరు విద్యార్థి దేశంలో గూఢచర్యం చేస్తూ, పాక్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు ( దర్యాప్తులో తేలింది. విద్యార్థి ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు.. దాన్ని ఫోరెన్సిక్ దర్యాప్తు కోసం పంపారు. అంతేకాదు, పాక్ అధికారులు, విద్యార్థి మధ్య జరిగిన నగదు లావాదేవీలను తెలుసుకునేందుకు అతని బ్యాంకు ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు.
వివరాలలోకి వెళితే .. హర్యానాలోని మస్త్గఢ్ చీకా గ్రామానికి చెందిన 25 ఏండ్ల దేవేంద్ర సింగ్ ధిల్లాన్ పాటియాలాలోని ఖల్సా కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. అయితే, అతడు ఇటీవలే తన ఫేస్బుక్ ఖాతాలో పిస్టోల్, గన్ చిత్రాలను అప్లోడ్ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిపై నిఘా పెట్టారు.
ఈ క్రమంలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన ఉద్రిక్తతల గురించి ఆ యువకుడు పాక్ ఏజెన్సీకి సమాచారం ఇచ్చినట్లు నిఘా అధికారులు గుర్తించారు. ఆపరేషన్ సిందూర్ గురించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాక్కు చేరవేసినట్లు ఇంటెలిజెన్స్ సమాచారం అందింది. దీంతో అధికారులు ఆవిద్యార్థిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో గతేడాది నవంబర్లో కర్తార్పూర్ కారిడార్ ద్వారా పాక్కు వెళ్లిన దేవేంద్ర పాక్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకుంటున్నట్లు తేలింది. ధిల్లాన్ను ఆకర్షించేందుకు పాక్ నిఘా అధికారులు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్లు అధికారులు గుర్తించారు. పాటియాలా మిలిటరీ కంటోన్మెంట్ చిత్రాలను కూడా పాక్ అధికారులతో పంచుకున్నట్లు కైతాల్ పోలీస్ సూపరింటెండెంట్ ఆస్తా మోదీ తెలిపారు.