నాంపల్లిలో శాశ్వత బస్‌స్టాండ్ ఏర్పాటు చేయాలి..

నాంపల్లి, ఆంధ్రప్రభ: నాంపల్లి మండల కేంద్రంలో శాశ్వత బస్‌స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరుతూ సామాజిక వేత్త కర్నాటి శ్రీహరి సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణ శర్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కర్నాటి శ్రీహరి మాట్లాడుతూ.. నాంపల్లి మండల కేంద్రంలో ప్రత్యేకమైన బస్‌స్టాండ్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

మండల కేంద్రం చుట్టుపక్కల గ్రామాలకు ప్రధాన రవాణా కేంద్రంగా ఉన్నప్పటికీ, ప్రయాణికులు ప్రధాన రహదారి పక్కనే బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు ఎండ, వర్షాల సమయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బస్సులు రహదారిపైనే నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్యలు ఏర్పడటంతో పాటు ప్రమాదాల ముప్పు కూడా ఉందని పేర్కొన్నారు.

నాంపల్లి మండల కేంద్రంలో అనువైన స్థలాన్ని గుర్తించి ప్రయాణికుల నిరీక్షణ గది, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు, బస్సుల పార్కింగ్ తదితర మౌలిక సదుపాయాలతో కూడిన శాశ్వత బస్‌స్టాండ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల దీర్ఘకాలిక సమస్యగా ఉన్న బస్‌స్టాండ్ ఏర్పాటుపై అధికారులు సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కర్నాటి శ్రీహరి కోరారు.