Peddapalli | ఆ చావులకు మీరే సమాధానం చెప్పాలి.. బండి సంజ‌య్

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : నక్సల్స్ పై నిషేధం విధించిన కాంగ్రెస్ పార్టీయే ఈరోజు నక్సల్స్ తో చర్చలు జరపాలని చెప్పడం ఆ పార్టీ రెండు నాల్కల ధోరణికి నిదర్శనమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ… తుపాకీ చేతపట్టి అమాయకులను చంపుతుంటే సామాజిక కోణంతో చూడాలనడం బాధాకరమన్నారు. తుపాకీ పట్టి చంపేటోళ్లతో చర్చలేందని ప్రశ్నించారు. దశాబ్దాలుగా నక్సల్స్ చేసిన హింసతో ఎంతో మంది చనిపోయారని, నెత్తురోడిన ఎన్నో దృశ్యాలను చూసిన ప్రొఫెసర్ హరగోపాల్, వరవరరావు సాధించిందేమిటో చెప్పాలన్నారు. నక్సల్స్ తుపాకీ వీడి లొంగిపోవాల్సిందేనని, జనజీవన స్రవంతిలో కలవాల్సిందేనని ఉద్ఘాటించారు.

ఈవిషయంలో హరగోపాల్, వరవరరావుసహా పౌరహక్కుల సంఘం నేతలే నక్సల్స్ కు నచ్చజెప్పాలని సూచించారు. కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ది కోసం రూ.12లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిందన్నారు. ఒక్క నేషనల్ హైవేస్ అభివృద్ధి కోసమే 1 లక్షా 25 వేల 485 కోట్ల ఖర్చు చేసినామని, ఇవిగాక రైల్వేల అభివృద్ధికి రూ.32వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. వడ్ల కొనుగోలు కోసమే లక్షనర్న కోట్ల రూపాయల దాకా ఖర్చు చేశామని, మేం ఇంత చేసినా కేంద్రం నయాపైసా ఇయ్యలేదని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు. కేంద్రం ఖర్చు చేసిన నిధులపై లెక్కా పత్రంతో సహా వివరిస్తామని, చర్చకు రావాలని కోరినా వాళ్లు రావడం లేదన్నారు.

Leave a Reply